Kentucky Shooting: తనిఖీకి వెళ్లిన ముగ్గురు పోలీసులను కాల్చి చంపిన దుండగుడు!
ABN , First Publish Date - 2022-07-03T17:37:29+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకుల మోతలు మోగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన టెక్సాస్, మేరీల్యాండ్ ఘటనలను మరవకముందే తాజాగా కెంటుకీలో మరో ఘటన చోటు చేసుకుంది.
కెంటుకీ: అగ్రరాజ్యం అమెరికాలో తుపాకుల మోతలు మోగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన టెక్సాస్, మేరీల్యాండ్ ఘటనలను మరవకముందే తాజాగా కెంటుకీలో మరో ఘటన చోటు చేసుకుంది. ఫ్లాయిడ్ కౌంటీలోని ఓ ఇంట్లో సోదాలకు వెళ్లిన పోలీసులపై దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు చనిపోయారు. వారితో పాటు ఓ జాగిలం కూడా ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఒక్కసారిగా దుండగుడి కాల్పులతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే బ్యాకప్ కోసం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం దుండగుడు దాగి ఉన్న ఇంట్లోకి ప్రవేశించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని లాన్స్ స్టోర్జ్ను(49) గా గుర్తించారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఫ్లాయిడ్ కౌంటీ పోలీస్ అధికారి జాన్ హంట్ తెలిపారు. ప్రస్తుతం లాన్స్ను విచారిస్తున్నామని, అతడు ఎందుకు ఇలా చేశాడో తెలుసుకునే పనిలో ఉన్నట్లు జాన్ హంట్ చెప్పారు.
ఇక యూఎస్లో ఇటీవల తరచూ కాల్పుల ఘటనలు జరుగుతున్నాయి. జూన్15న మెక్సికోలో పోలీసులు, సైనికులు, సాయుధుల మధ్య జరిగిన కాల్పుల్లో పది మంది సాయుధులు మృతిచెందారు. మరో ముగ్గురు డిటెక్టివ్లతో పాటు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అంతకుముందు మేరీల్యాండ్లోని కొలంబియాలో ఉన్న మెషీన్ అనే కంపెనీలో పనిచేసే ఓ వ్యక్తి తోటి ఉద్యోగులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. అలాగే ఫిలడెల్ఫియాలోని వీక్లీ మార్కెట్లో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరో 11 మంది గాయపడ్డారు. సౌత్ స్ట్రీట్లో జనసందోహంపైకి దుండగులు కాల్పులకు పాల్పడడంతో భారీ నష్టం జరిగింది. ఇలా రోజుల వ్యవధిలోనే అగ్రరాజ్యం కాల్పుల మోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.