Viral News: కేవలం రూ.2500తో.. ఇరవై కోట్లు విలువ చేసే ఇల్లు!

ABN , First Publish Date - 2022-12-08T16:52:31+05:30 IST

ఓ సాధారణ వ్యక్తిని అదృష్టం వరించింది. దీంతో ఏకంగా రూ.20కోట్లు విలువ చేసే ఇల్లు అతడి సొంతం అయింది. అంతేకాదూ.. అదనంగా అతడికి రూ.2.5కోట్ల నగదు కూడా..

Viral News: కేవలం రూ.2500తో.. ఇరవై కోట్లు విలువ చేసే ఇల్లు!

ఎన్నారై డెస్క్: అదృష్టం ఎవరి తలుపును ఎప్పుడు ఎలా తడుతుందో చెప్పడం చాలా కష్టం. ఈ విషయం మరోసారి రుజువైంది. తాజాగా ఓ సాధారణ వ్యక్తిని అదృష్టం వరించింది. దీంతో ఏకంగా రూ.20కోట్లు విలువ చేసే ఇల్లు అతడి సొంతం అయింది. అంతేకాదూ.. అదనంగా అతడికి రూ.2.5కోట్ల నగదు కూడా దక్కింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అతడికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. ఇంతకూ అతడు ఎవరు? రూ.2,500తో అంత ఖరీదైన ఇంటిని ఎలా పొందాడు? అనే విషయాలు తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

అతడి పేరు మార్క్. బ్రిటన్‌కు చెందిన ఇతడి వయసు ప్రస్తుతం 55ఏళ్లు కాగా.. గత 25ఏళ్లుగా లీగల్ అడ్వైజర్‌గా పని చేస్తున్నాడు. మార్క్ భార్య పేరు డిబోరా. ఆమె వెల్‌నెస్ కోచ్‌గా పని చేస్తోంది. భార్యాభర్తలు ఇద్దరూ 2019 నుంచి బ్రిటన్‌లోని డివోన్(Devon) ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే మార్క్ తాజాగా రూ.2500 విలువైన డబ్బుతో ‘ఓమేజ్ మిలియన్ పౌండ్ హౌస్’ లాటరీని కొనుగోలు చేశాడు. అయితే.. అతడికి అదృష్టం వరించడంతో ఏకంగా స్పెయిన్‌లోని మార్బెల్లా ఏరియాలో రూ.20కోట్ల విలువ చేసే భవంతిని గెలుచుకున్నాడు. అంతేకాదు అదనంగా రూ.2.5కోట్ల రూపాయలను అతడు రివార్డుగా పొందాడు.

కాగా.. తాను ఇల్లు గెలుచుకున్నట్టు తెలుసుకుని మార్క్ ఒక్క క్షణం షాకయ్యాడు. అనంతరం తేరుకుని.. ఎగిరి గంతేశాడు. ఇప్పటి వరకు తొమ్మిది సార్లు లాటరీ టికెట్లను కొనుగోలు చేసినట్టు చెప్పాడు. అయితే ఎప్పుడూ తాను ఏమీ గెలుచుకోలేదని వెల్లడించాడు. స్పెయిన్‌లో తాను గెలుచుకున్న ఇంటిని హాలీడే ట్రిప్స్ కోసం ఉపయోగించుకుంటానని చెప్పాడు. కాగా.. ప్రస్తుతం ఇతడికి సంబంధించిన వార్త స్థానికంగా కాకుండా నెట్టింట కూడా వైరల్‌గా మారింది.

Updated Date - 2022-12-08T16:55:17+05:30 IST