పర్యావరణ హితంగా..
ABN , First Publish Date - 2022-08-31T10:07:08+05:30 IST
పర్యావరణ హితంగా..
కొమ్మలు, రెమ్మలతో అలంకరించి... పుష్పం, పత్రంతో అర్చించి.. నారికేళాది ఫలాలు నివేదించి పూజించే వినాయక చవితి ప్రకృతితో మమేకమైన మహోత్సవం. అందుకే ఈ పండుగను హానికరమైన రసాయన రంగులు, మట్టిలో మిళితం కాని ప్లాస్టర్ ఆఫ్ ప్యారి్సలకు దూరంగా, పర్యావరణ హితంగా జరుపుకొంటే... ఆ గనాధిపతుడి ఆశీస్సులే కాదు.. ప్రకృతి ప్రసాదాలూ పొందుతాం.
సాధారణంగా వినాయక విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారి్సతో చేస్తారు. తయారీలో రసాయన రంగులు, పలు మెటల్స్, ఇతర మెటీరియల్స్ ఉపయోగిస్తారు. వీటిని నిమజ్జనం చేసినప్పుడు నీరు కలుషితమవుతుంది. నదులు, సముద్రాల్లోని జలాచరాల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. బయోడిగ్రేడబుల్ కాని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మెటీరియల్తో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మెరుపుల కోసం ఉపయోగించే ఐటెమ్స్, మెటల్స్ కెమికల్స్ మిళితమై ఉండడంవల్ల అలర్జీలకు దారి తీస్తాయి. అదే ఎకోఫ్రెండ్లీ విగ్రహాలైతే సులువుగా మట్టిలో కలిసిపోతాయి. నేలకు, నీటిలోని జీవాలకు ఎలాంటి హానీ ఉండదు. రసాయనాలు లేని సహజసిద్ధమైన రంగుల వాడకం వల్ల ఆరోగ్య సమస్యలేవీ దరి చేరవు. ఈ విగ్రహాల తయారీ కూడా ఎంతో సులభం. తక్కువ ఖర్చులో, కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం రూపొందించిన ప్రతిమను ప్రతిష్టించి, పూజిస్తే ఆ సంతృప్తి, సంతోషం మాటల్లో చెప్పలేం. ఒకవేళ కొనాలంటే ఎకోఫ్రెండ్లీ విగ్రహాన్ని గుర్తించడం ఎలా? నిజానికి ఇది పెద్ద సమస్య కాదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల బరువు తక్కువ. రంగులు, హంగులతో మెరుస్తుంటాయి. అదే ఎకోఫ్రెండ్లీ అయితే బరువుగా ఉంటాయి.