Mamata Banerjee and ED : పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్ట్
ABN , First Publish Date - 2022-07-23T18:21:38+05:30 IST
పశ్చిమ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత పార్థ ఛటర్జీ (Partha Chatterjee
కోల్కతా : పశ్చిమ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత పార్థ ఛటర్జీ (Partha Chatterjee)ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate ED) శనివారం అరెస్టు చేసింది. ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈ చర్య తీసుకుంది.
పార్థ ఛటర్జీని ఈడీ అధికారులు రెండు రోజులపాటు విచారించారు. అనంతరం ఆయనను మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల ప్రకారం అరెస్టు చేశారు. ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ (Arpita Mukherjee) నివాసంలో సుమారు రూ.20 కోట్ల నగదును ఈడీ శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకుంది. ఆమెను కూడా శనివారం ఈడీ అదుపులోకి తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాల్లో కుంభకోణం జరిగినట్లు కేసు నమోదైంది. జూన్ 29న ఈడీ అధికారులు రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఈ నియామకాల ప్రక్రియను నిర్వహించింది. ఉపాధ్యాయుల నియామకం కోసం కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. చాలా మంది పలుకుబడిగల వ్యక్తులు ఈ కేసులో నిందితులు. పార్థ ఛటర్జీ ఓ హై పవర్డ్ సూపర్వైజరీ కమిటీని ఏర్పాటు చేశారని, ఈ కుంభకోణానికి మూలం ఈ కమిటీయేనని కలకత్తా హైకోర్టు గతంలో పేర్కొంది. కోర్టు సమక్షంలో ఈ కమిటీ సభ్యులు ఇచ్చిన స్టేట్మెంట్లు పరస్పర విరుద్ధంగా ఉండటంతో సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) దర్యాప్తునకు ఆదేశించింది. పార్థ ఛటర్జీ మే 18న, మే 25న సీబీఐ దర్యాప్తునకు హాజరయ్యారు.