37 శాతం మంది పాకిస్థాన్ ప్రజల మనోగతమిది
ABN , First Publish Date - 2022-12-13T02:58:42+05:30 IST
రాజకీయ అనిశ్చితి.. ఆర్థిక అధోగతి.. పాకిస్థాన్ పరిస్థితిది. అలాంటిచోట అవకాశం ఉంటే దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమని 37 శాతం మంది ప్రజలు ఓ సర్వేలో కుండబద్దలు
ఆక్రమిత కశ్మీర్లో వెళ్లిపోతామంటున్న 44 శాతం
ఇస్లామాబాద్, డిసెంబరు 12: రాజకీయ అనిశ్చితి.. ఆర్థిక అధోగతి.. పాకిస్థాన్ పరిస్థితిది. అలాంటిచోట అవకాశం ఉంటే దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమని 37 శాతం మంది ప్రజలు ఓ సర్వేలో కుండబద్దలు కొట్టారు. బలూచిస్థాన్ ప్రావిన్స్లో వీరి శాతం 47గా ఉంది. ఆ తర్వాతి ఖైబర్ పఖ్తూన్హ్వా, సింఽధ్ ప్రావిన్స్లున్నాయి. మరోవైపు దురాక్రమించి తనదిగా చెప్పుకొంటున్న పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని 44 శాతం ప్రజలది కూడా వీలైతే వెళ్లిపోతామనే మాటే. 15 ఏళ్లుపైబడిన 20,548 మందితో ఆన్లైన్ పద్ధతిలో ఈ సర్వే నిర్వహించారు. ఇదేదో బయటి సంస్థలు/వ్యక్తుల సర్వే కాదు. పాక్ రాజధాని ఇస్లామాబాద్లోని పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవల్పమెంట్ ఎకనామిక్స్ సంస్థ చేసినది. ‘దేశ భక్తి-విధేయత’ అంశాల ఆధారంగా మనోగతం తెలుసుకునేందుకు సర్వే చేపట్టింది. ‘‘మా దేశ ఆర్థిక వ్యవస్థ కొన్నేళ్లుగా సంక్షోభంలో ఉంది. ఉద్యోగాలు దొరకడంలేదు. సంక్షేమం కొరవడి అభివృద్ధి లేక, అవకాశాల లేమితో యువత విసుగెత్తారు. మెరుగైన జీవనం కోసం విదేశాలకు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు’’ అని పాక్ విధానాలను విశ్లేషించే రాజా అహ్మద్ రూమీ తెలిపారు.