Shivamogga: ప్రభుత్వానికి పెనుసవాల్గా వినాయక ఉత్సవాలు
ABN , First Publish Date - 2022-08-21T17:49:18+05:30 IST
కొవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లపాటు సాదాసీదాగా సాగిన గణేశ ఉత్సవాలు ఈసారి రాష్ట్రవ్యాప్తంగా వైభవోపేతంగా జరగనున్నాయి. ఇది
- ఈద్గా మైదానంలో నిర్వహణపై పోలీసు వర్గాల ఆందోళన
- కోస్తాలోనూ ఉద్రిక్తతలు...
- 23 వరకు శివమొగ్గలో నిషేధాజ్ఞల కొనసాగింపు
బెంగళూరు, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లపాటు సాదాసీదాగా సాగిన గణేశ ఉత్సవాలు ఈసారి రాష్ట్రవ్యాప్తంగా వైభవోపేతంగా జరగనున్నాయి. ఇది శుభపరిణామమే అయినప్పటికీ బెంగళూరు చామరాజపేట ఈద్గా మైదానంలో ఇంటెలిజెన్స్ హెచ్చరికలను కాదని గణేశ ఉత్సవాలకు అనుమతి ఇచ్చే దిశలో ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉందని పోలీసు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక దక్షిణకన్నడ, శివమొగ్గ(Shivamogga) తదితర జిల్లాల్లో వరుస హత్యలతో అట్టుడికిపోతున్న కోస్తా ప్రాంతం ఇంకా పూర్తిగా శాంతించలేదు. పైగా స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా చెలరేగిన వీరసావర్కర్, టిప్పు ఫ్లెక్సీల వివాదం హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈసారి ఎలాగైనా గణేశ ఉత్సవాలను భారీగా నిర్వహించాలని అనేక హిందూ సంఘాలు భావిస్తున్నాయి. పైగా కోస్తా, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో గణేశ ఉత్సవాల సందర్భంగా వీరసావర్కర్ ఫొటోలు, విగ్రహాలు కూడా ఉంచాలని కొన్ని హిందూ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. 2023 శాసనసభ ఎన్నికలపై దృష్టి సారించిన కమలనాథులు హిందూ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకునే దిశలో ఈ ఉత్సవాలకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గణేశ ఉత్సవాల నిర్వహణ రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు పెను సవాల్ కానుందని భావిస్తున్నారు. మరోవైపు నివురుగప్పిన నిప్పులా ఉన్న శివమొగ్గ(Shivamogga)లో నిషేధాజ్ఞలను ఈనెల 23వరకు పొడిగిస్తున్నట్టు ఏడీజీపీ అలోక్కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ ముందు జాగ్రత్త కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.