స్వచ్ఛమైన తాగు నీటి లభ్యత, పారిశుద్ధ్యం ప్రాధాన్యతాంశాలు: ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2022-02-24T00:05:57+05:30 IST

స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కనీస సౌకర్యాలను కలిపించడం ద్వారా సమాజాన్ని రోగాలబారి నుంచి కాపాడేందుకు వీలుంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

స్వచ్ఛమైన తాగు నీటి లభ్యత, పారిశుద్ధ్యం ప్రాధాన్యతాంశాలు: ఉపరాష్ట్రపతి

చెన్నై: స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కనీస సౌకర్యాలను కలిపించడం ద్వారా సమాజాన్ని రోగాలబారి నుంచి కాపాడేందుకు వీలుంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుందన్నారు. కరోనా మహమ్మారి సమయంలో మనందరికీ తరచుగా చేతులు కడుక్కోవడం అలవాటైందని, ఇకపైనా కూడా ఈ అలవాటును కొనసాగించడం ద్వారా ఆరోగ్యంగా ఉండాలని ఆయన సూచించారు.బుధవారం చెన్నైలోని రాజ్ భవన్ నుంచి అంతర్జాల వేదిక ద్వారా నేషనల్ వాష్ (వాటర్, సానిటైజేషన్ అండ్ హైజీన్) కాన్ క్లేవ్ – 2022 ను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్యం నుంచే చిన్నారుల్లో ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైన అలవాట్లను పెంపొందించడంతోపాటు ఇందుకు తగినట్లుగా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. 


అంగన్ వాడీలు, ప్రాథమిక పాఠశాలల నుంచే ఈ అలవాటును ప్రోత్సహించడం ద్వారా పెరిగి పెద్దయ్యాక మంచి అలవాట్లను కొనసాగించేందుకు వీలుంటుందని ఉపరాష్ట్రపతి సూచించారు.నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్, పంచాయతీ రాజ్ (ఎన్ఐఆర్‌డీపీఆర్) – హైదరాబాద్ ఆధ్వర్యంలో, కేంద్ర జలశక్తి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖలు, యునిసెఫ్, ఇతర సంస్థల సంయుక్త సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ‘పంచాయతీల స్థాయిలో స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, స్వచ్ఛత’ అంశంపై ఈ సదస్సులో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటిని, పారిశుద్ధ్యాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని మరీ ముఖ్యంగా గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని ఉపరాష్ట్రపతి సూచించారు. 


సమాజంలోని చివరి వ్యక్తి వరకు ఈ సౌకర్యాలు అందించినపుడే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.డబ్ల్యూఏఎస్‌హెచ్ (వాష్)లో పేర్కొన్న ప్రతి అంశాన్ని ప్రతి గడపకు అందించాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సంబంధిత వర్గాలకు చెందిన వారు చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ మైలురాయిని అధిగమించవచ్చని ఆయన సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాకు సంబంధించిన అనుసంధానత పెరుగుతోందని, సానుకూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయన్న ఉపరాష్ట్రపతి, ఇందుకు తగ్గట్లుగా ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు వంటి నైపుణ్యత కలిగిన ఎంతో మందికి ఉపాధి కూడా కలుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. కొత్త లైన్ల ఏర్పాటుతోపాటు తదనంతరం ఈ లైన్ల నిర్వహణ కోసం కూడా నైపుణ్య కార్మికుల అవసరం ఉంటుందన్నారు.జలమే జీవనం అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ.. నీటి సంరక్షణ పైనా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. 


మన పూర్వీకులు కూడా నదులు, జలవనరుల సమీపంలోనే నివాసాలు ఏర్పాటుచేసుకున్నారన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. మన దేశం పొడగునా నదులు, చెరువులు ఎక్కువగా ఉన్నాయని, అయితే కొంతకాలంగా అవి నిరాదరణకు గురవుతున్నాయన్నారు. జీవనాడి అయిన నదుల సంరక్షణ కూడా అత్యంత కీలకమైన అంశమని ఉపరాష్ట్రపతి సూచించారు.ఈ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి గిరిరాజ్ సింగ్, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఎన్ఐఆర్డీపీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి. నరేంద్ర కుమార్, యునిసెఫ్ భారతదేశ ప్రతినిధి గిలియన్ మెల్సోప్, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ కుమార్, యునిసెఫ్ వాష్ భారతదేశ ప్రతినిధి నికోలస్ ఓస్బర్ట్, యునిసెఫ్ హైదరాబాద్ చీఫ్ మీతల్ రస్దియా, కర్ణాటక గ్రామీణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శి ఎల్కే అతీక్ తో పాటు ఆయా శాఖల ముఖ్య అధికారులు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-24T00:05:57+05:30 IST