Kanhaiya Lal హంతకులపై కోర్టు ఆవరణలోనే Attack
ABN , First Publish Date - 2022-07-03T00:07:41+05:30 IST
ఉదయ్పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్య కేసు నిందితులపై శనివారంనాడు ఉదయం దాడి..
జైపూర్: ఉదయ్పూర్ టైలర్ కన్హయ్య లాల్ (Kanhaiya lal) హత్య కేసు నిందితులపై శనివారంనాడు ఉదయం దాడి (Attack) జరిగింది. జైపూర్లోని కోర్టు ఆవరణలో లాయర్లు ఈ దాడికి పాల్పడ్డారు. కన్హయ్య హత్య కేసులో నలుగురు నిందితులను జైపూర్లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ముందు భారీ భద్రత మధ్య ఉదయం హాజరుపరిచారు. ప్రధాన నిందితులైన రియాజ్, గౌస్ మహమ్మద్తో పాటు మరో ఇద్దరు నిందితులను అజ్మీర్ జైలు నుంచి జైపూర్కు తీసుకువచ్చారు. కోర్టు ఆవరణలోనూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు నుండి నిందితులను బయటకు తీసుకు వెళ్తుండగా న్యాయవాదులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోతూ వారిపై దాడికి దిగారు. ''మారో మారో'' అంటూ నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడి నుంచి వారిని తప్పించి పోలీసు వ్యాను ఎక్కించారు.
పది రోజుల జ్యుడిషియల్ కస్టడీ..
కాగా, ఈ కేసులో నిందితులు నలుగురికి 10 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి ఎన్ఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. దీనికి ముందు, ప్రధాన నిందితులు ఇద్దరినీ ఏటీఎస్ హెడ్క్వార్టర్స్లో ఉంచారు. ఇదే కేసులో గురువారం రాత్రి అరెస్టు చేసిన మరో ఇద్దరు నిందితులు మొహిసిన్, ఆసిఫ్లను కూడా ఏటీఎస్ హెడ్క్వార్టర్స్లోనే ఉంచారు.