కాంగ్రెస్ కంచుకోటలో తీవ్ర పోరు
ABN , First Publish Date - 2022-11-30T02:23:50+05:30 IST
గుజరాత్లో కాంగ్రె స్కు కంచుకోటగా భావించే వ్యారా నియోజకవర్గంలో తొలిసారిగా ఇద్దరు క్రైస్తవ అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
వ్యారా బరిలో తొలిసారిగా ఇద్దరు క్రైస్తవులు
అహ్మదాబాద్, నవంబరు 29: గుజరాత్లో కాంగ్రె స్కు కంచుకోటగా భావించే వ్యారా నియోజకవర్గంలో తొలిసారిగా ఇద్దరు క్రైస్తవ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రానికి తొలి గిరిజన సీఎం అమర్సిన్హ్ చౌదరిని అందించిన స్థానంగా వ్యారాకు గుర్తింపు ఉంది. షెడ్యూల్ తెగలకు రిజర్వు అయిన ఈ స్థానంలో కాంగ్రెస్ తరఫున సిటింగ్ ఎమ్మెల్యే పూనాభాయ్ గామిత్ బరిలోకి దిగుతున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గామిత్ను ఎదుర్కోవడానికి బీజేపీ తొలిసారిగా మోహన్ కొంకణిని రంగంలోకి దించింది. ఈ నియోజకవర్గంలోని క్రైస్తవ ఓటర్లందరూ కాంగ్రె్సనే మళ్లీ గెలిపిస్తారని గామిత్ ధీమా వ్యక్తం చేస్తుండగా.. రాష్ట్రంలో బీజేపీ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తమ పార్టీకే ఓటేస్తారని మోహన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రధాని మోదీని రావణాసురుడితో పోలుస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు గుజరాతీలపై వారికి ఉన్న ధ్వేషాన్ని తెలియజేస్తున్నాయని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆరోపించారు. ఈ ప్రవర్తన వల్ల ఈ సారి కూడా కాంగ్రె్సను రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తారని ట్వీట్ చేశారు. ఇది మోదీతోపాటు ప్రతి గుజరాతీనీ అవమానించినట్లేనని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా పేర్కొన్నారు. కాగా, ఖర్గే దళిత వర్గానికి చెందినవారు కావడం వల్లే బీజేపీ ఆయనపై దాడి చేస్తోందని కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, సుప్రియా షినాటే తిప్పికొట్టారు.