తుపాకీ కాల్పులపై ఏకసభ్య కమిటీ విచారణ పూర్తి

ABN , First Publish Date - 2022-02-19T14:12:33+05:30 IST

తూత్తుకుడి తుపాకీ కాల్పుల ఘటనపై సాక్షుల వద్ద విచారణ శుక్రవారంతో పూర్తయిందని, మరో మూడు నెలల్లో రాష్ట్రప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు కమిషన్‌ న్యాయవాది అరుళ్‌వడివేల్‌శేఖర్‌ తెలిపారు.

తుపాకీ కాల్పులపై ఏకసభ్య కమిటీ విచారణ పూర్తి

ప్యారీస్‌(చెన్నై): తూత్తుకుడి తుపాకీ కాల్పుల ఘటనపై సాక్షుల వద్ద విచారణ శుక్రవారంతో పూర్తయిందని, మరో మూడు నెలల్లో రాష్ట్రప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు కమిషన్‌ న్యాయవాది అరుళ్‌వడివేల్‌శేఖర్‌ తెలిపారు. తూత్తుకుడి పట్టణంలో ఉన్న స్టెరిలైట్‌ కాపర్‌ కర్మాగారానికి వ్యతిరేకంగా 2018 మే 22న చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న వారిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతిచెందగా, వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం విచారణ జరిపేందుకు మాజీ న్యాయమూర్తి అరుణా జగదీశన్‌ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్‌ ఏర్పాటుచేసింది. ఆ కమిషన్‌ ఆగస్టు 9వ తేదీ నుంచి విచారణ మొదలుపెట్టింది. తొలివిడతగా కలెక్టర్‌ కార్యాలయం, ప్రభుత్వాసుపత్రి, అన్నానగర్‌, త్రేస్‌పురం, స్టెరిలైట్‌ కర్మాగారం క్వార్టర్స్‌  సహా కాల్పులు జరిగిన ప్రాంతాలను పరిశీలించింది. అనంతరం తూత్తుకుడి బీచ్‌ రోడ్డులో ఉన్న క్యాంప్‌ కార్యాలయంలో ఇప్పటివరకు 36 విడతలుగా సాక్షుల వద్ద విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో 1,426 మందికి సమన్లు జారీచేయగా, 1,048 మంది విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. మరో 1,544 ఆధారాలను ఈ కమిషన్‌ సేకరించింది. కాల్పులు జరిపిన సమయంలో జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన వెంకటేశ్‌, ఎస్పీగా ఉన్న మహేంద్రన్‌, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌, డీజీపీల వద్ద విచారణ జరిపింది. సమన్లు అందుకొని విచారణకు హాజరుకాని సాక్షులు విచారణ కమిషన్‌ ముందు తమ న్యాయవాదుల ద్వారా ప్రమాణపత్రాలు దాఖలుచేశారు. ఈ నేపథ్యంలో, శుక్రవారం కమిషన్‌ న్యాయవాది అరుళ్‌వడివేల్‌శేఖర్‌ మీడియాతో మాట్లాడుతూ, తూత్తుకుడి కాల్పులపై విచారణ పూర్తయిందని, తమ నివేదికను అన్ని వివరాలతో సమగ్రంగా తయారుచేసి, మరో మూడు నెలల్లో రాష్ట్రప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-02-19T14:12:33+05:30 IST