బిహార్లో వంతెనను కొట్టేసిన దొంగలు
ABN , First Publish Date - 2022-04-10T08:20:26+05:30 IST
బిహార్లోని దొంగలు ఏకంగా 500టన్నుల బరువున్న ఓ ఇనుప వంతెనను ఎత్తుకెళ్లిపోయారు.
రోహ్తాస్, ఏప్రిల్ 9: బిహార్లోని దొంగలు ఏకంగా 500టన్నుల బరువున్న ఓ ఇనుప వంతెనను ఎత్తుకెళ్లిపోయారు. అధికారుల్లా వచ్చి వారధిని పట్టపగలే చుట్టబెట్టేసి పట్టుకుపోయారు. పక్కాప్లాన్తో వచ్చిన చోరులు.. స్థానికుల ముందే పని ముగించుకెళ్లారు. 1972లో రోహ్తాహ్ జిల్లాలోని అమియావర్ గ్రామంలో ఆరా నదిపై 60అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తుతో ఓ వంతెనను నిర్మించారు. అయితే, ఆ వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో.. చాలాకాలం నుంచి వాడుకలో లేదు. దీనికి బదులుగా కాంక్రీటు వంతెన నిర్మించారు. ఓ దొంగల ముఠా పాత వంతెన ఇనుముపై కన్నేసింది. ఇంకేముంది.. ఎర్త్మూవర్ యంత్రం, గ్యాస్ కట్టర్లు వంటి సరంజామాతో గ్రామంలోకి దొంగలు వచ్చారు.
నీటిపారుదల శాఖ సిబ్బందిమంటూ పరిచయం చేసుకొన్నారు. ప్రమాదకర స్థితిలో ఉన్న వంతెనను తొలగించాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయని చెప్పారు. యంత్రంతో బ్రిడ్జిని కూల్చేసి.. గ్యాస్ కట్టర్లతో వంతెనను భాగాలుగా కత్తిరించి.. ఇనుప రద్దును వ్యాన్లో వేసుకొని ఉడాయించారు. మూడురోజులపాటు ఈ తతంగం జరిగిందని.. ఈ నెల 5కి వంతెన ఆనవాళ్లు కూడా లేకుండా చేశారని స్థానికులు చెప్పారు. ఆ తర్వాత ఈ నెల 8న గ్రామస్థులు అసలు విషయం గ్రహించి నీటిపారుదల అధికారులకు సమాచారం ఇచ్చారు. వారి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీ్సలు.. దొంగతనంలో ఇరిగేషన్ శాఖ ఇంటిదొంగల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. కాగా.. ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.