మా పాలనలో ఇంతటి నిరుద్యోగిత లేదు
ABN , First Publish Date - 2022-09-25T07:54:54+05:30 IST
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ శనివారం బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని మోదీ పదేపదే ‘‘కాంగ్రెస్ ఈ 70 ఏళ్లలో ఏం చేసింది?’’ అని అడిగే ప్రశ్నకు సూటిగా సమాధానమిచ్చారు.
ధరలు ఇంతగా పెరగలేదు
ఐదారుగురు ధనికులకే బీజేపీ ప్రభుత్వం అనుకూలం
రాహుల్గాంధీ విమర్శలు
తిరువనంతపురం, సెప్టెంబరు 24: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ శనివారం బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని మోదీ పదేపదే ‘‘కాంగ్రెస్ ఈ 70 ఏళ్లలో ఏం చేసింది?’’ అని అడిగే ప్రశ్నకు సూటిగా సమాధానమిచ్చారు. ‘‘మా 70 ఏళ్ల పాలనలో ఏనాడూ నిరుద్యోగిత ఇంతలా పెరగలేదు. ధరల పెరుగుదల ఈ స్థాయిలో లేనేలేదు’’ అని స్పష్టం చేశారు. తన భారత్ జోడో యాత్రలో భాగంగా శనివారం కేరళలోని చేర్తాలలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్గాంధీ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కేవలం ఐదారుగురు ధనికులకు అనుకూలంగా ఉందని.. మోదీ సర్కారుకు రైతులు, యువత, మహిళలపై పట్టింపే ఉండదని దుయ్యబట్టారు. ‘‘దేశాన్ని విభజిస్తే.. నిరుద్యోగ సమస్య పరిష్కృతమవుతుందనుకుంటున్నారా? విభజన వల్ల ఆస్పత్రులు, రహదారుల నిర్మాణం సాధ్యమా? చిన్నారులకు విద్యనందిస్తుందా?’’ అని ఆయన బీజేపీ సర్కారును నిలదీశారు. మోదీ మిత్రుడు, ఏ వ్యాపారంలోనైనా నియంతృత్వ ధోరణిలో ముందకు సాగే గౌతమ్ అదానీ ప్రపంచంలోనే రెండో ధనికుడు అయితే ప్రయోజనం ఏమిటని నిలదీశారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ధనికుడు మనదేశంలోనే ఉన్నా.. మన ప్రజలు నిత్యావసరాలకు అధిక ధరలను చెల్లించాల్సి వస్తోందని గుర్తుచేశారు.