Modi visit: పంజాబ్లో టెర్రర్ అలర్ట్... ఉగ్రవాదుల టార్గెట్లో10 మంది నేతలు
ABN , First Publish Date - 2022-08-21T20:31:49+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్లో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు టెర్రర్ అలర్ట్...
చండీగఢ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్లో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు (punjab police) టెర్రర్ అలర్ట్ (Terror alert) ప్రకటించారు. పంజాబ్లో భయోత్పాతం సృష్టించేందుకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) జరుపుతున్న కుట్రను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈ అలర్ట్ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం, చండీగఢ్, మోహాలిలో ఉగ్రదాడులకు ఐఎస్ఐ ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు ప్రాంతాల్లోని బస్ స్టాండ్లు, ప్రజారవాణాను టార్గెట్గా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చంటూ పంజాబ్ ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు తాజాగా అప్రమత్తం చేశాయి. ఈ సమాచారంతో పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసింది. ఈనెల 24న మోహాలీలో ప్రధాని పర్యటించి, టాటా కేన్సర్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు.
ఉగ్రవాదుల టార్గెట్లో పది మంది నేతలు
కాగా, ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం, పది మంది రాజకీయ నేతలు ఉగ్రవాదుల టార్గెట్లో ఉన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్జీందర్ సింగ్ రాండ్వా, మాజీ మంత్రులు గుర్జీత్ కోట్లి, విజయేందర్ సింగ్లా, పర్మిందర్ పింకీ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇచ్చిన సమాచారంతో వీరందరికీ పంజాబ్ ప్రభుత్వం మరింత భద్రత పెంచింది. కాగా, దేశ రాజధానిలో దీపక్ మొగ, సున్నీ ఇసపూర్, సందీప్ సింగ్, విపిన్ జఖర్ అనే నలుగురు నలుగురు ఉగ్రవాదులను పంజాబ్ పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. కెనడా గ్యాంగ్స్టర్ అర్షద్ డల్లా, ఆస్ట్రేలియాకు చెందిన గుర్జంటా జింటాతో ఈ నలుగురికి సంబంధాలు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ, మోగా, మొహాలీ ప్రాంతాలు ఉగ్రవాదుల టార్గెట్గా ఉన్నట్టు ఈ నలుగురూ పోలీస్ ఇంటరాగేషన్లో వెల్లడించినట్టు చెబుతున్నారు.