Orders: ఇకపై తమిళంలోనే ‘ఇనిషియల్’
ABN , First Publish Date - 2022-08-24T14:07:16+05:30 IST
రాష్ట్రంలో మాతృభాషాభివృద్ధిలో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు సంతకాలు చేసేటప్పుడు వారి పేర్ల ముందున్న ‘ఇనిషియల్’
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
చెన్నై, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మాతృభాషాభివృద్ధిలో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు సంతకాలు చేసేటప్పుడు వారి పేర్ల ముందున్న ‘ఇనిషియల్’ (ఇంటిపేరు) తమిళంలోనే రాయాలని రాష్ట్ర ప్రభుత్వం(State Govt) ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అధికార తమిళభాషా చట్టాన్ని అన్ని శాఖల్లో పటిష్టంగా అమలు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. ఆ మేరకు సీఎం నుంచి ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అటెండర్ వరకూ, రాష్ట్ర ప్రజలు తమిళంలోనే సంతకాలు చేయాలని, ఆ సంతకం ముందున్న ఇనిషియల్ ఆంగ్లంలో కాకుండా తమిళాన్నే రాయాలని అన్ని శాఖలకు ఉత్తర్వులందాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లోనూ తమిళ భాష(Tamil language)కు ప్రాధాన్యం కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆ మేరకు ఇకపై పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ తమిళంలోనే సంతకాలు చేయాలని, ఆ సంతకాలలో ఇంటిపేరు ఆంగ్లంలో కాకుండా తమిళలోనే ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి అడ్మిషన్ ఫారాలు, బదిలీ సర్టిఫికెట్లు(Transfer Certificates), కాండక్ట్ సర్టిఫికెట్లు, పరీక్షా దరఖాస్తులు, హాల్ టికెట్లు, గుర్తింపు కార్డులు సహా అన్ని రకాల దస్తావేజులలోనూ విద్యార్థులు ఇనిషియల్ అక్షరం తమిళంలో ఉండాలని, ఈ దిశగా చర్యలు చేపట్టాలని రాష్ట్రంలోని ప్రధానోపాధ్యాయులందరికీ సర్క్యులర్ జారీ చేసారు.