రాష్ట్రంలో కరోనా చికిత్సా కేంద్రాల తగ్గింపు
ABN , First Publish Date - 2022-02-16T13:54:13+05:30 IST
రాష్ట్రంలో కరోనా, ఒమైక్రాన్ వ్యాప్తి బాగా తగ్గుముఖం పడుతుండటంతో కరోనా చికిత్సా కేంద్రాల సంఖ్యను తగ్గించనున్నట్లు ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్ తెలిపారు. వైద్యకోర్సుల్లో కొత్తగా చేరిన వైద్య విద్యార్థులతో మంగళవారం
- ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాధాకృష్ణన్
చెన్నై: రాష్ట్రంలో కరోనా, ఒమైక్రాన్ వ్యాప్తి బాగా తగ్గుముఖం పడుతుండటంతో కరోనా చికిత్సా కేంద్రాల సంఖ్యను తగ్గించనున్నట్లు ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్ తెలిపారు. వైద్యకోర్సుల్లో కొత్తగా చేరిన వైద్య విద్యార్థులతో మంగళవారం రాజీవ్గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాలలో సమావేశమైన రాధాకృష్ణన్.. వారికి పలు సూచనలు చేశారు. మంచి వైద్యులుగా పేరు తెచ్చుకుని, ఈ దేశానికి సేవ చేయాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైర్సల వ్యాప్తి తగ్గుతూ వస్తోందని, ఈ పరిస్థితుల్లో కరోనా చికిత్సా కేంద్రాలు, ప్రత్యేకవార్డులను తగ్గించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం కరోనా సోకి ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని, అంతే కాకుండా వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చుతుందనే అనుమానంతో పలుచోట్ల ఏర్పాటు చేసిన ప్రత్యేక చికిత్సా కేంద్రాల అవసరం లేకపోయిందన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని కరోనా చికిత్సా కేంద్రాల సంఖ్యను క్రమంగా తగ్గించనున్నట్లు వివరించారు.ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే విద్యార్థుల నుంచి వసూలు చేయాలని, అదనపు వసూలు చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో 1.13 కోట్ల మంది రెండో డోస్ తీసుకోలేదని వివరించారు. ఇదే విధంగా 3.8 లక్షల మంది దివ్యాంగులు కరోనా టీకా తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా 60ఏళ్లకు బడిన వారు సుమారు 45 లక్షల మంది ఇంకా తొలి టీకా వేసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు.