Hijab ban case: హిజాబ్ వివాదంపై ముగిసిన విచారణ... తీర్పును రిజర్వు చేసిన సుప్రీంకోర్టు...
ABN , First Publish Date - 2022-09-22T22:27:43+05:30 IST
కర్ణాటక (Karnataka)లోని పాఠశాల తరగతి గదుల్లో హిజాబ్ (hijab)ను ధరించడంపై
న్యూఢిల్లీ : కర్ణాటక (Karnataka)లోని పాఠశాల తరగతి గదుల్లో హిజాబ్ (hijab)ను ధరించడంపై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. 10 రోజులపాటు విచారణ జరిపిన ధర్మాసనం తన తీర్పును రిజర్వు చేసింది. ఇక తాము హోం వర్క్ చేయవలసిన సమయం వచ్చిందని జస్టిస్ హేమంత్ గుప్తా (Hemant Gupta), జస్టిస్ సుధాంశు ధూలియా (Sudhanshu Dhulia) చెప్పారు.
పిటిషనర్ల తరపున 20 మందికిపైగా న్యాయవాదులు వాదనలు వినిపించారు. సీనియర్ అడ్వకేట్లు రాజీవ్ ధావన్, కపిల్ సిబాల్, సల్మాన్ ఖుర్షీద్, దేవదత్ కామత్, సంజయ్ హెగ్డే తదితరులు వీరిలో ఉన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఏఎస్జీ కేఎం నటరాజ్, కర్ణాటక అడ్వకేట్ జనరల్ ప్రభులింగ నవడ్గి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు.
పిటిషనర్ల తరపు న్యాయవాదులు ప్రభుత్వ వాదనను తిప్పికొట్టేందుకు కోర్టు గురువారం సమయం ఇచ్చింది. సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే ముస్లిం పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తూ, వీథుల్లో నిరసనలను రెచ్చగొట్టేందుకు కుట్ర జరిగిందని, దానిలో పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) ప్రమేయం ఉందని సొలిసిటర్ జనరల్ చెప్పడాన్ని విమర్శించారు. అనవసరమైన విషయాన్ని సొలిసిటర్ జనరల్ లేవనెత్తారని చెప్పారు. మీడియాలో విద్వేష ప్రసంగాలు, సెన్సేషనలిజంపై సుప్రీంకోర్టులోని వేరొక ధర్మాసనం బుధవారం జారీ చేసిన ఆదేశాలను ప్రస్తావించారు. ప్రస్తుతం ధర్మాసనం ముందు ఉన్న ప్రశ్న రాజ్యాంగ హక్కులకు సంబంధించినదని తెలిపారు. ఇటువంటి సమయంలో సొలిసిటర్ జనరల్ లేవనెత్తిన అంశం ప్రతికూల అభిప్రాయాన్ని సృష్టిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన సర్క్యులర్ను తానే ఉపసంహరించుకోవచ్చునన్నారు.
కర్ణాటక విద్యా శాఖ 2021లో జారీ చేసిన సర్క్యులర్ను దవేతోపాటు ఇతర పిటిషనర్లు కోర్టుకు సమర్పించారు. ప్రభుత్వ పీయూ కళాశాలల్లో యూనిఫారాలు తప్పనిసరి కాదని ఈ సర్క్యులర్ చెప్తోందని తెలిపారు. యూనిఫారాలను తప్పనిసరి చేసే నిబంధనలను విధించే కళాశాలల యాజమాన్యాలకు శిక్ష విధిస్తామని తెలిపిందని చెప్పారు.
తమ సొంత మార్గదర్శకాలు నిరూపణ కాలేదని సొలిసిటర్ జనరల్ చెప్తున్నారని, 2022 విద్యా సంవత్సరం కోసం మార్గదర్శకాలను వారి సొంత అఫిడవిట్లోనే తెలియజేశారని, యూనిఫారాలు తప్పనిసరి కాదని ఈ మార్గదర్శకాలు చెప్తున్నాయని తెలిపారు. తమ సొంత మార్గదర్శకాలనే ఎలా కాదంటారని ప్రశ్నించారు.
సీనియర్ అడ్వకేట్ హుజెఫా అహ్మది వాదనలు వినిపిస్తూ, హిజాబ్ను ధరించడం వల్ల విద్యకు, క్రమశిక్షణకు ఏ విధంగా విఘాతం కలుగుతుందో సరైన కారణాన్ని వివరించలేదన్నారు.
అసలు ప్రశ్న
హిజాబ్ ధారణ ఇస్లాం మతాచారాల్లో ముఖ్యమైనదా? మతాన్ని అవలంబించే స్వేచ్ఛ, సంస్కృతి, వ్యక్తిగత గోప్యత, హుందాతనం హక్కుకు సంబంధించిన రాజ్యాంగపరమైన ప్రశ్నలు కోర్టు ముందు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు మతపరమైన వివరణ అవసరం కాబట్టి, ఈ పిటిషన్లపై విచారణను తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలని ముస్లిం పిటిషనర్లు కోరారు. శబరిమల, ఇతర మతపరమైన సమస్యలను ఈ విధంగానే అప్పగించారని తెలిపారు.
ఇదిలావుండగా, ఈ ధర్మాసనంలోని జస్టిస్ హేమంత్ గుప్తా అక్టోబరు 16న పదవీ విరమణ చేయబోతున్నారు. కాబట్టి ఈ తీర్పు అంతకుముందే వెలువడే అవకాశం ఉంది.