Modi Birthday: మోదీ బాల్యాన్ని గుర్తు చేసే సైకత శిల్పం... వినూత్న రీతిలో సుదర్శన్ పట్నాయక్ శుభాకాంక్షలు...
ABN , First Publish Date - 2022-09-17T17:54:47+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాల సందర్భంగా
పురి (ఒడిశా) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాల సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తన కళ ద్వారా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ బాల్యాన్ని గుర్తు చేసేవిధంగా ఐదు అడుగుల ఎత్తయిన సైకత (ఇసుక) శిల్పాన్ని రూపొందించారు. 1,213 టీ కప్పులను ఉపయోగించి, దీనిని తయారు చేశారు.
మోదీ 72వ జన్మదినోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆధ్యాత్మిక గురువు దలైలామా వంటివారు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన బాల్యంలో టీ అమ్మిన నేపథ్యంలో ఆ స్థాయి నుంచి దేశానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగిన విషయాన్ని గుర్తు చేస్తూ సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పురి బీచ్లో ఓ సైకత శిల్పాన్ని తయారు చేశారు.
ఈ శిల్పాన్ని తయారు చేయడానికి పట్నాయక్ 1,213 మట్టి పాత్రలను ఉపయోగించారు. మోదీ బొమ్మను వేసి, ఆంగ్ల అక్షరాల్లో ‘హ్యాపీ బర్త్డే మోదీజీ’ అని రాశారు. దీని నిర్మాణానికి ఐదు టన్నుల ఇసుకను ఉపయోగించారు.
గతంలో కూడా మోదీ జన్మదినోత్సవాల సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ రకరకాల సైకత శిల్పాలను ఏర్పాటు చేసి, శుభాకాంక్షలు తెలిపారు. పట్నాయక్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టీ అమ్ముకునే స్థాయి నుంచి దేశానికి ప్రధాన మంత్రి పదవిని చేపట్టే స్థాయికి ఎదిగారని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేయడం కోసమే మట్టి టీ పాత్రలను ఉపయోగించి, ఈ సైకత శిల్పాన్ని తయారు చేశానని తెలిపారు. తన కళ ద్వారా తాను మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు.
‘పద్మశ్రీ’ సుదర్శన్ పట్నాయక్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 అంతర్జాతీయ శాండ్ ఆర్ట్ చాంపియన్షిప్స్, ఫెస్టివల్స్లో పాల్గొన్నారు. దేశానికి అనేక బహుమతులను సాధించిపెట్టారు. ఆయన తన కళ ద్వారా సామాజిక సందేశాన్ని వ్యాపింపజేసేందుకు ప్రయత్నిస్తారు.