దేశం విడిచి వెళ్లొద్దు : గొటబయ రాజపక్స సోదరులకు శ్రీలంక సుప్రీంకోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2022-07-15T23:08:47+05:30 IST

శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స సోదరులు, మాజీ ప్రధాన మంత్రి

దేశం విడిచి వెళ్లొద్దు : గొటబయ రాజపక్స సోదరులకు శ్రీలంక సుప్రీంకోర్టు ఆదేశం

కొలంబో : శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స సోదరులు, మాజీ ప్రధాన మంత్రి మహింద రాజపక్స (Mahindra Rajapaksa), మాజీ మంత్రి బసిల్ రాజపక్స (Basil Rajapaksa) దేశం విడిచి వెళ్ళరాదని శ్రీలంక సుప్రీంకోర్టు ఆదేశించింది. గొటబయ విదేశాలకు వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆయన సోదరులిద్దరూ జూలై 28 వరకు దేశం విడిచి వెళ్ళకూడదని ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది. మహింద, బసిల్‌లపై ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ శ్రీలంక, మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది. 


శ్రీలంక (Sri Lanka) తాత్కాలిక అధ్యక్షునిగా రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గొటబయ రాజపక్స దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్లమెంటు స్పీకర్ మహింద యాప అబేయవర్దన అధికారికంగా ప్రకటించారు. రాజకీయ, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో నిరసనలు పెల్లుబకడంతో గొటబయ రెండు రోజుల క్రితం దేశం విడిచి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. 


గొటబయ రాజపక్స దేశాధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను ఆమోదించినట్లు పార్లమెంటు స్పీకర్ మహింద యాప అబేయవర్దన శుక్రవారం ప్రకటించారు. అనంతరం రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకునే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత రానున్న ఏడు రోజుల్లో నూతన దేశాధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నట్లు స్పీకర్ తెలిపారు. 


Updated Date - 2022-07-15T23:08:47+05:30 IST