మోటారు వాహనాల కేసులకు పోలీసు స్టేషన్లలో ప్రత్యేక యూనిట్లు
ABN , First Publish Date - 2022-12-31T05:00:01+05:30 IST
మోటారు వాహనాల ప్రమాదం కేసుల్లో పరిహారం పొందడానికి వీలుగా పోలీసు స్టేషన్లలో ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మూడు నెలల్లో వీటిని ఏర్పాటు చేయాలని సూచించింది.
మూడు నెలల్లో ఏర్పాటు చేయాలి
క్లెయిమ్స్ ట్రైబ్యునల్కు నివేదికలు ఇవ్వాలి
రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ, డిసెంబరు 30: మోటారు వాహనాల ప్రమాదం కేసుల్లో పరిహారం పొందడానికి వీలుగా పోలీసు స్టేషన్లలో ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మూడు నెలల్లో వీటిని ఏర్పాటు చేయాలని సూచించింది. అన్ని పోలీసు స్టేషన్లలో కాకపోయినా కనీసం పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటుకు చేయాలని హోంశాఖ కార్యదర్శులు, డీజీపీలను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎస్.ఎ.నజీర్, జస్టిస్ జె.కె.మహేఽశ్వరిలతో కూడిన ధర్మాసనం నష్ట పరిహారం చెల్లింపు విషయమై పలు మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం.. రోడ్డు ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ అధికారి మోటారు వాహనాల సవరణ చట్టం-2022 సెక్షన్ 159లో పేర్కొన్న చర్యలను తీసుకోవాలి. 48 గంటల్లోగా క్లెయిమ్స్ ట్రైబ్యునల్కు ఫస్ట్ యాక్సిడెంట్ రిపోర్టును పంపించాలి. మూడు నెలల్లోగా అదే ట్రైబ్యునల్లో ‘యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు’ను సమర్పించాలి. పోలీసులతో సమన్వయం చేసుకుంటూ రిజిస్టరింగ్ అధికారి వాహనం రిజిస్ర్టేషన్, లైసెన్స్, ఫిట్నెస్, పర్మిట్ తదితర అంశాలను తనిఖీ చేసి ట్రైబ్యునల్లో వివరాలు సమర్పించాలి. తీసుకుంటున్న చర్యలపై దర్యాప్తు అధికారి బాధితునికిగానీ, ఆయన తరఫు న్యాయవాదికిగానీ, డ్రైవర్, యజమాని, బీమా కంపెనీలకు తెలియజేస్తుండాలి. పరిహారం కోసం బాధితులు హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేయకపోతే క్లెయిమ్స్ ట్రైబ్యునల్కు సమర్పించిన ఫస్ట్ క్లెయిమ్ పిటిషనే చెల్లుబాటు అవుతుంది.
ఆప్షన్ పెట్టుకున్నవారికే అధిక పింఛను
న్యూఢిల్లీ, డిసెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈపీఎఫ్ పథకం కింద అధిక పింఛను పొందడంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ తీర్పును ఎనిమిది వారాల్లో అమలు చేస్తామని పేర్కొంది. అదనపు పించనుకు ఎవరెవరు అర్హులన్నదానిపై స్పష్టత ఇచ్చింది. 2014 సెప్టెంబర్ 1కి ముందు పదవీ విరమణ చేసినవారు జీతంలో ఎక్కువ మొత్తాన్ని పెన్షన్ నిధికి జమ చేసి, అధిక పెన్షన్ కోసం ఆప్షన్ను పెట్టుకున్న వారికే ఇది వర్తిస్తుంది. రూ. 5వేల నుంచి రూ, 6,500 వేతన పరిమితిని మించి జీతంలో ఎక్కువ మొత్తాన్ని పీఎఫ్ నిధికి జమ చేసిన వారు ఇందుకు అర్హులు. ఈపీఎఫ్ పింఛను పథకాన్ని సవరించకముందు జాయింట్ ఆప్షన్ను కోరుకున్న వారు, అలా ఆప్షన్ పెట్టుకున్నా ఈపీఎఫ్ సంస్థ తిరస్కరణ పొందిన వారు ఇప్పుడు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే సవరించని ఈపీఎఫ్ పథకంలోని పేరా 11(3) కింద ఎలాంటి ఆప్షన్ను కోరకుండా 2014 సెప్టెంబర్ 1కి ముందు రిటైరైన ఉద్యోగులకు, ఈపీఎఫ్ సభ్యత్వం నుంచి తప్పుకొన్న వారికీ సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎలాంటి ప్రయోజన లభించదని తెలిపింది.