తెలుగు మాట్లాడుతూ తమిళ వేషం
ABN , First Publish Date - 2022-11-08T02:56:33+05:30 IST
తెలుగు మాట్లాడుతూ తమిళ వేషం వేసినవారా నన్ను విమర్శించేది’ అంటూ తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డీఎంకే నేతల్ని జలగల వేషం వేసుకున్న నల్లులతో పోల్చారు.
అలాంటి మీరా నన్ను విమర్శించేది?
తెలంగాణ ఫామ్హౌ్సలో వారసత్వ రాజకీయాలు
వాటి గురించి ప్రజల కళ్లకు కట్టినట్లు చెబుతున్నా
అందుకే వారికి రాజ్భవన్పై కోపం
గవర్నర్ ‘తమిళిసై’ సంచలన వ్యాఖ్యలు
చెన్నై, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘తెలుగు మాట్లాడుతూ తమిళ వేషం వేసినవారా నన్ను విమర్శించేది’ అంటూ తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డీఎంకే నేతల్ని జలగల వేషం వేసుకున్న నల్లులతో పోల్చారు. తెలుగు రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న తమిళిసై.. తెలుగు మాట్లాడేవారు తనను విమర్శిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ తమిళిసై స్టాలిన్ నేతృత్వంలోని ఇటీవలి కాలంలో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో వారిద్దరి వైఖరినీ తూర్పారబడుతూ డీఎంకే అధికార పత్రిక అయిన ‘మురసొలి’లో ‘‘గవర్నర్లూ! అగ్ని పర్వతాలతో చెలగాటం వద్దు’’ శీర్షికన ఓ వ్యాసం ప్రచురితమైంది. తెలంగాణకు గవర్నర్గా ఉన్న తమిళిసైను అక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆమె చెన్నైలోనే కాలం గడుపుతున్నారంటూ డీఎంకే ఆ వ్యాసంలో ఎద్దేవా చేసింది. దీనిపై తమిళిసై ట్విట్టర్లో తీవ్రంగా స్పందించారు.
‘‘తెలంగాణలో ఏమి జరుగుతోందో పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి. తెలుగు మూలాలు ఉండి, ఇంట్లో ఆ భాష మాట్లాడుతూ తమిళ వేషం వేసినవారు.. గవర్నర్గా తెలంగాణ శాసనసభలో తమిళంలో తిరుక్కురళ్ సూక్తిని పఠించిన తమిళ వనితను నేనన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గత మూడేళ్లుగా తెలంగాణ స్థానిక పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలిస్తే ఎవరు భయపడుతున్నారో? ఎవరు ధైర్యంగా ఉన్నారో మీకు తెలుస్తుంది. నాకు సమాధానం చెప్పడానికి పాలకులు, కుటుంబవారసులు, మంత్రులు కంకణం కట్టుకుని బారులు తీరి నిలిచి ఉండటమే ఇందుకు సాక్ష్యం. నేను చేతులు ముడుచుకుని ఉన్నట్లు కలలు కంటున్నారా? తెలంగాణలో ఫామ్హౌ్సలో జరిగే వారసత్వ రాజకీయాలతో కూడిన ప్రభుత్వం గురించి ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించడం వల్లనే వారికి రాజ్భవన్పై కోపం. మిమ్మల్ని మీరు అగ్ని పర్వతాలుగా ప్రకటించుకోవడం చాలా సంతోషం. అదే సమయంలో ఆ అగ్ని పర్వతాలు హిమాలయాలను ఏమి చేయలేవనే వాస్తవాన్ని గమనించాలి. మురసొలి తాటాకు చప్పుళ్లకు మేం భయపడం. ఉరుములు, మెరుపులు, పిడుగులే మమ్మల్ని ఏం చేయనప్పుడు కేవలం మురసొలి (ఢంకా నాదం) మమ్మల్ని ఏం చేయగలదు? సాలెపురుగులు సింహాలను ఏం చేయగలవు?’’ అంటూ నిప్పులు చెరిగారు.