Enforcement Directorate ఎదుట హాజరుకానున్న sonia gandhi... దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
ABN , First Publish Date - 2022-07-21T03:30:06+05:30 IST
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గురువారం ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ముందు హాజరుకానున్నారు.
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ (National Herald) కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (sonia gandhi) గురువారం ఎన్ఫోర్స్మెంట్ (Enforcement Directorate) అధికారుల ముందు హాజరుకానున్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద ఆమె వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో సోనియా, రాహుల్ల షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వీరి పాత్రలకు సంబంధించి ప్రశ్నించనున్నారు.
వాస్తవానికి సోనియా గాంధీ గత నెలలోనే హాజరుకావాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా హాజరుకాలేకపోయారు. ఇదే కేసులో ఆమె తనయుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇప్పటికే పలుమార్లు ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. జూన్ 13న తొలిసారి ఈడీ ముందు హాజరైన రాహుల్ గాంధీ ఇప్పటి వరకూ నాలుగు సిట్టింగ్స్లో 40 గంటల సేపు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు.
మరోవైపు సోనియా ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది.
కాంగ్రెస్ పార్టీకి నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న 90.25 కోట్ల రూపాయలను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు కేవలం 50 లక్షల రూపాయల చెల్లింపుతో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి (subramanian swamy) గతంలో ఆరోపించారు. సోనియా, రాహుల్ నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని ఆయాచితంగా పొందారని కూడా స్వామి గతంలో ఆరోపించారు.