Shashikala: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
ABN , First Publish Date - 2022-09-13T13:05:33+05:30 IST
డీఎంకే ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ(Shashikala) వ్యాఖ్యానించారు. విప్లవ యాత్ర
- రోడ్షోలో శశికళ
ప్యారీస్(చెన్నై), సెప్టెంబరు 12: డీఎంకే ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ(Shashikala) వ్యాఖ్యానించారు. విప్లవ యాత్ర పేరుతో ఆమె సోమవారం సేలం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రోడ్షో నిర్వహించారు. ఆతూర్ ప్రాంతంలో ఆమె మాట్లాడుతూ, పోలీసులకు స్వేచ్ఛ లేని కారణంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి, చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. ముక్కలైన అన్నాడీఎంకేను ఏకం చేసి మళ్లీ రాష్ట్రప్రజలకు మంచి పాలన అందజేయాలన్న లక్ష్యంతోనే తాను విప్లవ యాత్ర చేపట్టానని, తాను వెళ్లిన ప్రాంతాల్లో ప్రజలు చూపించే ఆదరణ, అభిమానంతో అన్నాడీఎంకే(AIADMK)కు పూర్వవైభవం తీసుకొస్తానన్నారు. పార్టీలో అసంతృప్తికి గురైన వారు విభేధాలు పక్కనబెట్టి ఐక్యత చాటాలని, అప్పుడే పార్టీ మళ్లీ బలం పుంజుకుంటుందని శశికళ సూచించారు.
15న అన్నాదురైకు శశికళ నివాళి...
దివంగత మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై 114వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 15న తంజావూరు(Thanjavur)లో ఆయన చిత్రపటానికి శశికళ నివాళులర్పించనున్నారు. దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత చూపిన బాటలో కార్యకర్తలను సమీకరించేందుకు శశికళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రస్తుతం పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 15వ తేది ఉదయం 10 గంటలకు తంజావూరు అరుళానందనగర్లో ఆమె అన్నాదురైకు నివాళులర్పిస్తారు. కాగా, సోమవారం సేలం జిల్లాకు చెందిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఎంజీఆర్, జయలలిత విగ్రహాలకు నివాళులర్పించేందుకు శశికళకు అనుమతించరాదంటూ ఆతూర్ డీఎస్పీ రామచంద్రన్కు ఫిర్యాదు చేశారు.