RS Bharati: గవర్నర్ రీకాల్పై కోర్టును ఆశ్రయిస్తాం
ABN , First Publish Date - 2022-11-11T09:13:19+05:30 IST
గవర్నర్ను రీకాల్ చేయాలన్న వినతిపై రాష్ట్రపతి స్పందించని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని డీఎంకే అధికార ప్రతినిధి ఆర్ఎస్ భారతి(RS Bharti) తెలిపారు.
- మా పార్టీలోకి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
- డీఎంకే నేత ఆర్ఎస్ భారతి
పెరంబూర్(చెన్నై), నవంబరు 10: గవర్నర్ను రీకాల్ చేయాలన్న వినతిపై రాష్ట్రపతి స్పందించని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని డీఎంకే అధికార ప్రతినిధి ఆర్ఎస్ భారతి(RS Bharti) తెలిపారు. తిరుచ్చిలో ఆయన గురువారం విలేఖరులతో మాట్లాడుతూ గవర్నర్ బీజేపీ నేతలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ శాసనసభలో నెరవేర్చిన హిందీ వ్యతిరేక తీర్మానాన్ని పశ్చిమబెంగాల్, కేరళ, తెలంగాణా తదితర రాష్ట్రాలు కూడా వారి శాసనసభల్లో కూడా చేయనున్నట్టు తెలిపారు. హిందీ నేర్చుకుంటే మాత్రమే భవిష్యత్తు ఉంటుందని అసత్య ప్రచారాలకు బీజేపీ పాల్పడుతోందన్నారు. కానీ, హిందీ మాట్లాడుతున్న అనేకమంది మన రాష్ట్రంలో చిన్నా చితకా పనులకు వస్తున్నారని గుర్తు చేశారు. దేశంలోనే అధిక వేతనం పొందుతున్న సుందర్ పిచ్చై డీఎంకే ప్రభుత్వ హయాంలో ఇంగ్లీషు అభ్యసించారని గుర్తుచేశారు. హిందీ వ్యతిరేక తీర్మానం సమయంలో అన్నాడీఎంకే శాసనసభ నుంచి వాకౌట్ చేసిందన్నారు. ఎందుకంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు డీఎంకేలో చేరనున్నారని, త్వరలో ఎడప్పాడి కూడా తమ పార్టీలో చేరినా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదన్నారు. కానీ వారి అధినేత్రికే నమ్మక ద్రోహం చేసిన పళనిస్వామిని దరి చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు. అన్నాడీఎంకే ఎలాంటి స్థితిలో వున్నా డీఎంకే భాగస్వామేనని, కానీ బీజేపీ తమ పార్టీకి మాత్రమే కాకుండా దేశానికి కూడా శత్రువని ఆర్ఎస్ భారతి వ్యాఖ్యానించారు.