President elections 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్
ABN , First Publish Date - 2022-07-18T23:12:00+05:30 IST
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. అనేక రాష్ట్రాల్లో విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు ఓటేశారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. అనేక రాష్ట్రాల్లో విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు ఓటేశారు. ఒడిశాలోని కటక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మహ్మద్ ముకీమ్ ముర్ముకు ఓటేసినట్లు వెల్లడించారు. ఆత్మ ప్రభోదానుసారమే తాను ముర్ముకు ఓటేశానని మహ్మద్ ముకీమ్ ప్రకటించుకున్నారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్లోనూ రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. సమాజ్వాదీ ఎమ్మెల్యేల్లో కొందరు ముర్ముకు ఓటేశారు. ఒకప్పుడు తమ అధినేత ములాయం సింగ్ యాదవ్ను యశ్వంత్ సిన్హా ఐఎస్ఐ ఏజెంట్ అన్నారని, నిజమైన సమాజ్వాదీ పార్టీ ప్రజాప్రతినిధులెవ్వరూ యశ్వంత్కు ఓటెయ్యరని శివ్పాల్ యాదవ్ చెప్పారు. బాబాయ్ శివ్పాల్ యాదవ్ తీరుతో అఖిలేష్ షాకయ్యారు. ఎస్పీ విరోధులతో శివ్పాల్ చేతులు కలిపారని వాపోయారు. సమాజ్వాదీ పార్టీతో పొత్తున్న సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓంప్రకాశ్ రాజ్భర్ కూడా తన ఎమ్మెల్యేలతో కలిసి ముర్ముకు ఓటేశారు. యూపీ అసెంబ్లీ ఆవరణలో యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్తో కలిసి రాజ్భర్ విక్టరీ సింబల్ చూపుతూ ఫొటోలకు ఫోజిచ్చారు.
గుజరాత్ ఎన్సీపీ ఎమ్మెల్యే కంధాల్ ఎస్ జడేజా ముర్ముకు ఓటేసినట్లు ప్రకటించారు.
మరోవైపు ముర్ముకు శివసేన సంపూర్ణ మద్దతు ప్రకటించిందని శివసేన నేత ఆదిత్య థాకరే వెల్లడించారు. అకాళీదళ్ కూడా ముర్ముకు మద్దతు ప్రకటించింది.
ఎన్డీయేతో పాటు ఎన్డీయేతర పార్టీల మద్దతు సంపాదించిన ముర్ము దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించే తొలి గిరిజన మహిళగా ఖ్యాతికెక్కనున్నారు. ఈ నెల 21న ఫలితాలు వెలువడనున్నాయి.