గాడ్సేను పొగుడుతూ.. ‘సబర్మతి’కి విదేశీ ప్రముఖులా?
ABN , First Publish Date - 2022-04-24T08:05:53+05:30 IST
నాథూరామ్ గాడ్సే సిద్ధాంతాలను కొనియాడుతున్న బీజేపీ.. భారత్ పర్యటనకు వచ్చిన విదేశీ ప్రముఖులను మాత్రం సబర్మతి ఆశ్రమానికి తీసుకెళ్లి అక్కడ రాట్నం తిప్పడమేంటని శివసేన మండిపడింది.
బీజేపీ తీరును దుమ్మెత్తిపోసిన సామ్నా పత్రిక
ముంబై, ఏప్రిల్ 23: నాథూరామ్ గాడ్సే సిద్ధాంతాలను కొనియాడుతున్న బీజేపీ.. భారత్ పర్యటనకు వచ్చిన విదేశీ ప్రముఖులను మాత్రం సబర్మతి ఆశ్రమానికి తీసుకెళ్లి అక్కడ రాట్నం తిప్పడమేంటని శివసేన మండిపడింది. భారత్కు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజరాత్లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించడంపై శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’ ఈ మేరకు సంపాదకీయం రాసింది. ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతీకగా మహాత్మాగాంధీ నిలుస్తుండడమే దీనికి కారణమని పేర్కొంది. గుజరాత్లో ఉక్కుమనిషి సర్దార్ పటేల్ భారీ విగ్రహాన్ని (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) నిర్మించినా.. బ్రిటన్ ప్రధాని సహా విదేశీ అతిథులను ఎందుకు అక్కడకు తీసుకెళ్లడంలేదని బీజేపీ సర్కార్ను సామ్నా ప్రశ్నించింది. ఇటీవల దేశంలో మతఘర్షణలు జరగడంపైనా ఆ సంపాదకీయం దుమ్మెత్తిపోసింది.