కలకలం రేపుతున్న ప్రధాని వారసత్వం వ్యాఖ్యలు... కాంగ్రెస్ అభ్యంతరం

ABN , First Publish Date - 2022-08-16T01:00:36+05:30 IST

న్యూఢిల్లీ: అవినీతి, వారసత్వం అనే చెదపురుగులు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయని, వాటిని జనజీవనం నుంచి తరిమేద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

కలకలం రేపుతున్న ప్రధాని వారసత్వం వ్యాఖ్యలు... కాంగ్రెస్ అభ్యంతరం

న్యూఢిల్లీ: అవినీతి, వారసత్వం అనే చెదపురుగులు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయని, వాటిని జనజీవనం నుంచి తరిమేద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కొందరికి ఉండటానికే నీడలేకపోతే మరికొందరికి దాచిపెట్టుకోవడానికి చోటే సరిపోవట్లేదని, అవినీతిని నిర్మూలిస్తేనే సామాన్యుల జీవితాలు బాగుపడతాయని ప్రధాని చెప్పారు. అవినీతిపరులను క్షమిస్తే అభివృద్ధికి ఆటంకమని, దోషులుగా నిలబెట్టాల్సిందేనన్నారు. 


అదే సమయంలో ప్రధాని వారసత్వం గురించి మాట్లాడారు. వారసత్వం అనేది రాజకీయాలకే పరిమితం కాలేదని, దీని వల్ల సమర్థ నాయకులు రాలేకపోతున్నారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా మారిన వారసత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కుటుంబ, వారసత్వ రాజకీయాలను నిరసిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ పండితులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు చాలా వరకూ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలే కావడంతో వారసత్వ రాజకీయాలని ప్రధాని విరుచుకుపడింది వీరిపైనేనని భావిస్తున్నారు. 


ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బహుశా బీజేపీలోని అంతర్గత కలహాల వల్ల ప్రధాని ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని కాంగ్రెస్ పార్టీ నేత పవన్ ఖేరా ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో రాజకీయాల ప్రస్తావన చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా అభిప్రాయపడ్డారు. దీనిపై తాను కామెంట్ చేయబోనని రాహుల్ గాంధీ చెప్పారు. 



Updated Date - 2022-08-16T01:00:36+05:30 IST