ఇక ప్రజలు కేంద్రంగా పాలన: మోదీ
ABN , First Publish Date - 2022-06-07T08:40:19+05:30 IST
ప్రజలు కేం ద్రంగా పాలన సాగించే దిశగా 21వ శతాబ్దంలో భారత్ అడుగులు వేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు.
న్యూఢిల్లీ, జూన్ 6: ప్రజలు కేం ద్రంగా పాలన సాగించే దిశగా 21వ శతాబ్దంలో భారత్ అడుగులు వేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా సంస్కరణలపై ఫోకస్ పెట్టేందుకు ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో ఢిల్లీలోని విజ్ఞానభవన్లో ఐకానిక్ వారోత్సవాలను సోమవారం మోదీ ప్రారంభించారు. ఈనెల 11 వరకు ఈ వారోత్సవాలు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ ‘గతంలో ప్రభుత్వ కేంద్రం గా జరిగిన పాలన భారాన్ని దేశం భరించింది. అప్పుడు ప్రభుత్వ కేంద్రంగానే విధానాలు, నిర్ణయాలు ఉండేవి. ఏదైనా పథకం ప్రారంభమైన తర్వాత దాని ప్రయోజనాలు పొందడానికి ప్రభుత్వాన్ని ఆశ్రయించడం ప్రజల బాధ్యతగా ఉండేది. ఇప్పుడు ప్రజలు కేంద్రంగా పాలన దిశగా 21వ శతాబ్దంలో భారత్ అడుగులేస్తోంది’ అని చెప్పారు. ఎనిమిదేళ్లుగా యువత ప్రాధాన్యంగా సంస్కరణలు చేపట్టామని మోదీ తెలిపారు. ‘ఇప్పుడు యువ త సులభంగా పరిశ్రమలను నడపొచ్చు. 30 వేలకుపైగా అనుమతులు పొందాల్సిన పరిస్థితిని కుదించాం. 1,500కుపైగా చట్టాలను రద్దు చేశాం. సంస్కరణలతోపాటు సరళీకరణపై దృష్టి పెట్టాం’ అన్నారు. కాగా, భారతీయ బ్యాంకులు, కరెన్సీని అంతర్జాతీయ వాణి జ్యం, సరఫరా చైన్లో ముఖ్యభాగం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
జన సమర్థ్ పోర్టల్ ఆవిష్కరణ..
రుణాల లభ్యత సులభతరం చేసేందుకు 13 రుణ ఆధారిత ప్రభుత్వ పథకాలకు సంబంధించిన జన సమర్థ్ పోర్టల్ను మోదీ ఆవిష్కరించారు. విద్యార్థులు, రైతులు, వ్యాపారవేత్తలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తల కలలు సాకారమయ్యేలా ఈ పోర్టల్ దోహదం చేస్తుందన్నారు. ప్రభుత్వ రుణ పథకాలకు ఇది వన్ స్టాప్ డిజిటల్ లింకింగ్ పోర్టల్ అని పేర్కొన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లోగోలు ముద్రించిన రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలను కూడా మోదీ విడుదల చేశారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.