President elections 2022: ముగిసిన పోలింగ్.. 21న ఫలితాలు
ABN , First Publish Date - 2022-07-18T23:46:56+05:30 IST
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. పార్లమెంట్లో ఎంపీలు, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు ఓటేశారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. పార్లమెంట్లో ఎంపీలు, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు ఓటేశారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా పోటీ చేశారు. ముర్ముకు అధికార బీజేపీతో పాటు ఎన్డీయే పక్షాలు మద్దతిచ్చాయి. ఎన్డీయేతర పార్టీలైన బిజూ జనతాదళ్, శివసేన, అకాళీదళ్ కూడా ముర్ముకు మద్దతు ప్రకటించాయి. దీనికి తోడు ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. అనేక రాష్ట్రాల్లో విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు ఓటేశారు.
న్యూఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ పీపీఈ కిట్ ధరించి ఓటేశారు.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వీల్చెయిర్లో వచ్చి ఓటేశారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రాంగణంలో ఓటేశారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 44 పార్టీలు మద్దతిచ్చాయి. 63 శాతానికి పైగా మెజార్టీతో ముర్ము విజయం సాధించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఈనెల 21 ఫలితాలు వెలువడతాయి.
తెలంగాణ ముుఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఓటేశారు.
736 మందికి గానూ 727 మంది ఎంపీలు, 9 మంది ఎమ్మెల్యేలను ఎన్నికల సంఘం అనుమతించగా 721 మంది ఎంపీలు, 9 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ తెలిపారు. బ్యాలెట్ బాక్సులను రోడ్డు, వాయు మార్గాల ద్వారా ఢిల్లీకి తరలిస్తామన్నారు.