ఒకేషనల్ విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ లేటరల్ ఎంట్రీకి అర్హులే
ABN , First Publish Date - 2022-03-16T08:07:21+05:30 IST
ఒకేషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) శుభవార్త చెప్పింది. ..
న్యూఢిల్లీ, మార్చి 15: ఒకేషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) శుభవార్త చెప్పింది. బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ డిగ్రీ కోర్సులను మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ డిగ్రీలతో సమానంగా గుర్తించనున్నట్టు ఏఐసీటీఈ పేర్కొంది. తద్వారా లేటరల్ ఎంట్రీ పద్ధతిలో బీఈ/బీటెక్ సెకండియర్ కోర్సుల్లో చేరడానికి ఒకేషనల్ విద్యార్థులు కూడా అర్హులవుతారు. ఇప్పటివరకు బీఈ / బీటెక్ లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం... సంబంధిత ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ విభాగంలో మూడేళ్ల డిప్లొమా చదివిన విద్యార్థులను అర్హులుగా పరిగణిస్తున్నారు. అలాగే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ చదివిన బీఎస్సీ విద్యార్థులు కూడా లేటరల్ ఎంట్రీ పద్ధతిలో ఇంజనీరింగ్లో ప్రవేశం పొందవచ్చు. ఏఐసీటీఈ తాజా ఉత్తర్వులతో ఒకేషనల్ విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ సెకండియర్లో చేరడానికి పోటీపడవచ్చు. ఈ మేరకు సంబంధిత విద్యాసంస్థలకు సాంకేతిక విద్యామండలి ఉత్తర్వులను జారీచేసింది.