Congress Leader : ముర్ముపై వివాదాస్పద వ్యాఖ్యలు... కాంగ్రెస్ నేతకు ఎన్సీడబ్ల్యూ నోటీసు...
ABN , First Publish Date - 2022-10-06T22:52:21+05:30 IST
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)పై పరుష
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)పై పరుష వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్కు జాతీయ మహిళా కమిషన్ (NCW) గురువారం నోటీసు ఇచ్చింది. ఈ నెల 10న హాజరు కావాలని ఆదేశించింది. ఉదిత్ బుధవారం ఇచ్చిన ట్వీట్లో, ద్రౌపది ముర్ము వంటి రాష్ట్రపతి ఏ దేశానికీ ఉండకూడదని, చెమ్చాగిరికి ఓ హద్దు ఉంటుందని వ్యాఖ్యానించారు.
జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖ శర్మ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఉదిత్ రాజ్ వ్యాఖ్యలు ఓ మహిళకు వ్యతిరేకంగా ఉండటం మాత్రమే కాకుండా, రాజ్యాంగ అధిపతికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఆమె మహిళ అయినందువల్ల లక్ష్యంగా చేసుకున్నారా? అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు ఖండించదగినవన్నారు. ఆయనకు తాము నోటీసు ఇచ్చామని తెలిపారు. ఆయన అవమానకరంగా మాట్లాడారని, ఆయన ఉపయోగించిన భాష సిగ్గుచేటు అని చెప్పారు.
ద్రౌపది ముర్ము సోమవారం గుజరాత్లోని గాంధీ నగర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మన దేశంలో శ్వేత విప్లవం, ఉప్పు తయారీ గురించి ప్రస్తావించారు. పాల ఉత్పత్తి, వినియోగంలో భారత దేశం ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. పాడి రైతుల సహకార సంఘాలు పాల ఉత్పత్తిలో పోషించిన పాత్ర వల్ల ఈ ఘనత మనకు దక్కిందన్నారు. అదేవిధంగా మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఉప్పులో 76 శాతం ఉప్పు గుజరాత్లో ఉత్పత్తి అవుతోందన్నారు. గుజరాత్లో ఉత్పత్తి అవుతున్న ఉప్పును భారతీయులంతా తింటున్నారని చెప్పవచ్చునన్నారు.