Sanjay Raut: బెయిల్పై తీర్పు రిజర్వ్
ABN , First Publish Date - 2022-11-02T15:21:13+05:30 IST
ముంబై: మనీ లాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తు పై తీర్పును ముంబై కోర్టు...
ముంబై: మనీ లాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తు (Bail plea)పై తీర్పును ముంబై కోర్టు రిజర్వ్ (Reserve) చేసింది. ఈ కేసులో రౌత్ సన్నిహితుడుగా చెబుతున్న సహనిందితుడు ప్రవీణ్ రౌత్ బెయిల్పై కూడా తీర్పును ప్రత్యేక న్యాయమూర్తి ఎంజీ దేశ్పాండే (MG Deshpande) రిజర్వ్ చేశారు. ముంబై నార్త్ సబర్బ్లోని పత్రా చాల్ రీడవలప్మెంట్కు సంబంధించిన ఈ మనీలాండరింగ్ కేసుపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
కాగా, ఈ కేసులో సంజయ్ రౌత్, ప్రవీణ్ రౌత్ బెయిల్ అభ్యర్థనపై ఒకే రోజు తీర్పు చెప్పే అవకాశాల గురించి ఈడీ తరఫు న్యాయవాషి ఆశిష్ చవాన్ జడ్జిని అడిగారు. ప్రవీణ్ రౌత్ అకౌంట్ నుంచి రౌత్ అకౌంట్కు డబ్బులు వెళ్లినట్టు ఈడీ కేసు ఉన్నందున ప్రవీణ్ బెయిల్ అభ్యర్థనను తొలుత నిర్ణయించాల్సి ఉంటుందని జడ్జి వివరణ ఇచ్చారు. ప్రవీణ్ కేసును నిర్ణయించకుండా సంజయ్ రౌత్ కేసును నిర్ణయించలేనని ఆయన తెలిపారు. నవంబర్ 9న రెండు కేసులపై తీర్పును ప్రకటించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. మనీలాండరింగ్ కేసులో గత జూలై 31న రౌత్ను ఈడీ అరెస్టు చేసింది. సెప్టెంబర్ 7న బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు.