Agnipath: నేవీలో రిక్రూట్మెంట్కు 3 లక్షలకు పైగా దరఖాస్తులు
ABN , First Publish Date - 2022-07-24T00:33:37+05:30 IST
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకం కింద భారత నావికాదళంలో రిక్రూట్మెంట్ కోసం ఇంతవరకూ..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ (Agnipath) పథకం కింద భారత నావికాదళంలో (Indian Navy) రిక్రూట్మెంట్ కోసం ఇంతవరకూ 3 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నట్టు అధికారులు శనివారంనాడు తెలిపారు. వీరిలో 20,499 మంది మహిళలు ఉన్నారు. జూలై 1 నుంచి త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది.
నేవీలో ఈ ఏడాది తొలి విడత నియామకాల్లో భాగంగా భర్తీ చేయనున్న 2,800 పోస్టులకు గాను శుక్రవారం వరకూ 3 లక్షల 3 వేల 328 దరఖాస్తులు అందాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక అధికారి తెలిపారు. ఈ విధానంలో రిక్రూట్ అయిన వారిని అగ్నివీరులుగా పిలుస్తారు. న్యూ రిక్రూట్మెంట్ మోడల్ కింద 12వ తరగతి (సీనియర్ సెకండరీ రిక్రూట్స్) పాసయిన వారి కోసం జూలై 1న రిజస్టేషన్ పక్రియను నేవీ ప్రారంభించింది. జూలై 24 వరకూ ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. దీనితో పాటు 200 పోస్టుల భర్తీకి 10వ తరగతి ఉత్తీర్ణులైన వారి కోసం (మెట్రిక్యులేషన్ రిక్రూట్స్) చేపట్టిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 30 వరకూ కొనసాగనుంది. కాగా, భారత వైమానిక దళంలో చేరేందుకు ఎంతటి స్పందన వస్తోందో దానికి సమానంగా నేవీలో చేరేందుకు స్పందన వస్తోందని, సాయుధ బలగాల్లో అగ్నివీరులుగా సేవలందించేందుకు యువత ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని పేరు ఆ అధికారి వెల్లడించారు.