Minister: నిందితులను అరెస్ట్ చేస్తాం.. కొత్త వాటర్ ట్యాంక్ నిర్మిస్తాం
ABN , First Publish Date - 2022-12-30T09:02:46+05:30 IST
వెంగైవాయల్ గ్రామంలో 20 రోజుల్లో కొత్త ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మిస్తామని పర్యావరణ శాఖ
- మంత్రి మెయ్యనాధన్
పెరంబూర్(చెన్నై), డిసెంబరు 29: వెంగైవాయల్ గ్రామంలో 20 రోజుల్లో కొత్త ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మిస్తామని పర్యావరణ శాఖ మంత్రి మెయ్యనాధన్(Minister Meyyanadhan) తెలిపారు. పుదుకోట జిల్లా ఇరైయూర్ సమీపంలోని వెంగైవాయల్ గ్రామంలోని ఓవర్హెడ్ ట్యాంక్లో మానవ వ్యర్ధాలు కలిపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, గురువారం మంత్రి మెయ్యనాధన్ గ్రామంలో పర్యటించారు. వెంగైవాయల్ అయ్యనార్ ఆలయంలో అన్ని వర్గాల ప్రజలు గురువారం సామూహిక పొంగళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మెయ్యనాధన్ విలేఖరులతో మాట్లాడుతూ, సంఘటన జరిగిన వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, గంధర్వకోట ఎమ్మెల్యే సహా రెవెన్యూ అధికారులను అభినందిస్తున్నామన్నారు. ఈ సంఘటన ఆమోదయోగ్యం కాదని, అమానవీయమైన, నిందాపూర్వక చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నామని, వారిని అరెస్ట్ చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో మరెక్కడా తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి తెలిపారు.