Minister: ప్రజలు శాంతించాకే విమానాశ్రయ స్థల సేకరణ
ABN , First Publish Date - 2022-09-30T13:44:19+05:30 IST
కాంచీపురం సమీపంలోని పరందూర్ ప్రాంతం లో నిర్మించదలచిన కొత్త విమానాశ్రయానికి స్థానికులు శాంతించిన తర్వాతే స్థలసేకరణ పనులు
- మంత్రి వేలు
ప్యారీస్(చెన్నై), సెప్టెంబరు 29: కాంచీపురం సమీపంలోని పరందూర్ ప్రాంతం లో నిర్మించదలచిన కొత్త విమానాశ్రయానికి స్థానికులు శాంతించిన తర్వాతే స్థలసేకరణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి ఏవీ వేలు(Minister Avi Velu) స్పష్టం చేశారు. ఈరోడ్లో గురువారం జరిగిన పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో మంత్రి ఏవీ వేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరందూర్ విమానాశ్రయ స్థల సేకరణకు సంబంధించి కాంచీపురం(Kanchipuram) కలెక్టర్ కార్యాలయంలో ప్రజాభిప్రాయసేకరణ సమావేశం జరిగిందని తెలిపారు. నిర్వాసితులకు భారీ మొత్తంలో పరిహారం చెల్లించడంతో పాటు ప్రజలు ఆందోళన విరమించాకే ఈ పథకంపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈరోడ్ జిల్లాలో ‘నమ్మై కాక్కుం 48 నేరం’ పథకంలో 48 వేల మందికి రూ.19.33 కోట్లు కేటాయించామని, ఇందులో ప్రమాదాల్లో చిక్కుకున్న బాధితులు లబ్ధిపొందారని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 678 ఆస్పత్రుల ద్వారా 1.16 లక్షల మందిని రూ.103.36 కోట్ల మేర అత్యుత్తమ చికిత్స అందించి కాపాడినట్లు మంత్రి వేలు తెలిపారు.