Minister: రాష్ట్రంలో పలుచోట్ల శ్వాసకోస సమస్యలు
ABN , First Publish Date - 2022-12-13T11:14:02+05:30 IST
రాష్ట్రంలో పలు చోట్ల హఠాత్తుగా ప్రజలకు శ్వాసకోస సమస్యలు తలెత్తుతున్నాయని, వాతావరణంలో మార్పులు కూడా ఇందుకు కారణమని
- ఇది కరోనా కాదు.... ఆందోళన వద్దు
- ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్ వెల్లడి
బెంగళూరు, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పలు చోట్ల హఠాత్తుగా ప్రజలకు శ్వాసకోస సమస్యలు తలెత్తుతున్నాయని, వాతావరణంలో మార్పులు కూడా ఇందుకు కారణమని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్(Minister Dr. K. Sudhakar) పేర్కొన్నారు. నగరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హఠాత్తుగా తలెత్తిన శ్వాసకోస సమస్యలకు కరోనాతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ముందు జాగ్రత్తగా అప్రమత్తత పాటించాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సూ చించామన్నారు. వాతావరణంలో తేమ శాతం అధికం కావడంతో చాలా మంది జలుబు, దగ్గు తదితర సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్నారన్నారు. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ మార్గదర్శక సూత్రాలను విడుదల చేయబోతున్నామన్నారు. ఈ నెలంతా చల్లటి గాలులు, చినుకులతో వాతావరణం ఒకింత ఇబ్బందికరంగానే ఉంటుందని ప్రత్యేకించి పిల్లలు, వృద్ధుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. యువకుల్లో ఇటీవలి కొద్దికాలంగా హఠాత్తుగా గుండెపోట్లు వస్తున్న అంశంపై చర్చించేందుకు త్వరలో వైద్యనిపుణుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో వందతులు ప్రచారం చసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
రాజధానిలో వైరల్ జ్వరాలు
రాజధాని బెంగళూరు నగరంలో గత వారం రోజులుగా వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో జలుబు, దగ్గుతో పాటు వైరల్ జ్వరాల బారిన పడ్డ రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. విక్టోరియా ఆసుపత్రి, జయనగర్ జనరల్ ఆసుపత్రి, మల్లేశ్వరం కేసీ జనరల్ ఆసుపత్రుల్లో వైరల్ జ్వరాలతో వచ్చేవారి సంఖ్య పెరుగుతోందని అధికారులు వెల్లడించారు. శీతాకాలంలో వచ్చే సహజమైన సమస్యలు అస్తమా, అలర్జీ వంటివి కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. సాధ్యమైనంతవరకు రాత్రి 10 తర్వాత అవసరమైతేనే బయట సంచరించాలని, నీటిని వేడిచేసుకుని తాగాలని ఫ్రిజ్లో పదార్థాలకు దూ రంగా ఉండాలని అధికారులు సూచించారు.