Minister: రైతుల నుంచే చెరకు కొనుగోలు
ABN , First Publish Date - 2022-12-30T08:17:08+05:30 IST
రైతుల నుంచి చెరకు కొనుగోలు చేయనున్నట్లు వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ
- మంత్రి పన్నీర్సెల్వం
పెరంబూర్(చెన్నై), డిసెంబరు 29: రైతుల నుంచి చెరకు కొనుగోలు చేయనున్నట్లు వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ మంత్రి పన్నీర్సెల్వం(Minister Panneerselvam) తెలిపారు. పొంగల్ సందర్భంగా బియ్యం కార్డుదారులకు రూ.1,000 నగదు, కిలో పచ్చిబియ్యం, చక్కెర అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ప్రతి పొంగల్కు ఉచితాలతో పాటు చెరకు గడ ఇస్తుండగా, ఈ ఏడాది సీఎం ప్రకటనలో చెరకు ప్రస్తావన లేకపోవడంతో ప్రతిపక్షాలు, రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో, పొంగల్ ఉచితాల్లో చెరుకు గడ ఇస్తున్నట్లు బుధవారం సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో, మంత్రి పన్నీర్ సెల్వం విలేఖరులతో మాట్లాడుతూ, పొంగల్ పండుగ సందర్భంగా రేషన్ కార్డుదారులకు అందించే చెరకు గడలను రైతుల నుంచే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. తమ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ కొనుగోళ్లు చేపడతామని, ఏజెంట్ల బెడద లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.