Minister: ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ వాయిదా
ABN , First Publish Date - 2022-08-25T12:40:56+05:30 IST
ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి గురువారం ప్రారంభం కావాల్సిన జనరల్ కౌన్సెలింగ్ను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ
- ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి
పెరరబూర్(చెన్నై), ఆగస్టు 24: ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి గురువారం ప్రారంభం కావాల్సిన జనరల్ కౌన్సెలింగ్ను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి(State Higher Education Minister K. Ponmudi) ప్రకటించారు. రాష్ట్రంలోని 431 ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రభుత్వ కోటా సీట్లకు సంబంధించిన ఆన్లైన్ కౌన్సెలింగ్ ఈ నెల 20 నుంచి ప్రారంభమైంది. తొలివిడత ప్రత్యేక విభాగాలకు నిర్వహించిన కౌన్సెలింగ్లో 2,430 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ విభాగాల కౌన్సెలింగ్ బుధవారం 10 గంటలతో ముగియగా, సీట్లు పొందిన అభ్యర్థులకు అడ్మిషన్ పత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో, జనరల్ కౌన్సెలింగ్ గురువారం ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించారు. కానీ, ‘నీట్’ ఫలితాల విడుదల జాప్యం కావడంతో జనరల్ కౌన్సెలింగ్ జరుగుతుందా లేదా అనే సందేహం నెలకొంది. నీట్ ఫలితాలు ఈ నెల 21న విడుదల కానున్నాయనే ప్రకటనతో, ఈ కౌన్సెలింగ్(Counselling) షెడ్యూల్ ప్రకటించారు. కానీ, నీట్ ఫలితాల విడుదల్లో జాప్యం నెలకొనడంతో ఇంజినీరింగ్ జనరల్ కౌన్సెలింగ్ వాయిదాపడింది. నీట్ ఫలితాలు వెల్లడైన రెండు రోజుల తర్వాత జనరల్ కేటగిరి కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని మంత్రి పొన్ముడి బుధవారం స్పష్టం చేశారు.