Minister: ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2022-10-11T16:00:24+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు తనిఖీ చేసి, అక్కడి సమస్యలు పరిష్కరించేలా ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌

Minister: ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి కృషి

                                       - మంత్రి అన్బిల్‌ మహేష్‌


పెరంబూర్‌(చెన్నై), అక్టోబరు 10: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు తనిఖీ చేసి, అక్కడి సమస్యలు పరిష్కరించేలా ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సోమవారం ట్రిప్లికేన్‌ నియోజకవర్గంలోని లేడి వెల్లింగ్టన్‌ పాఠశాలలో ఎమ్మెల్యే ఉదయనిధి(MLA Udayanidhi)తో కలసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమైన మంత్రి పాఠశాలలోని సమస్యలు, విద్యాభోధనా తీరు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో ఒక్కో ప్రభుత్వ పాఠశాలను స్థానిక ఎమ్మెల్యేలు పరిశీలించి, అక్కడి సమస్యలు, బోధనా విధానంలో నివేదిక అందజేస్తారన్నారు. వంద రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం అనంతరం తయారుచేసిన నివేదిక ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించనున్నట్లు తెలిపారు. కాగా, నియోజకవర్గంలో ఒక పాఠశాల పరిశీలిస్తే సమస్యలు తెలియవని, మరిన్ని పాఠశాలలు పరిశీలించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఉదయనిధి మంత్రికి విజ్ఞప్తి చేశారు.


పాఠశాలల్లో సభలకు అనుమతి లేదు...

పాఠశాల ప్రాంగణాల్లో ఎలాంటి సభలకు అనుమతించలేదని మంత్రి అన్బిల్‌ మహేష్‌ తెలిపారు. కోవై పాఠశాలలో ఆర్‌ఎస్ఎస్‌ సభ్యులు కవాతు ప్రదర్శన చేయడంపై మంత్రి స్పందిస్తూ, వారు పాఠశాల శుభ్రం చేస్తామని ప్రవేశించినట్లు తెలిపారని, ఈ విషయమై అధికారులు విచారణ చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

Updated Date - 2022-10-11T16:00:24+05:30 IST