విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్‌ అల్వా

ABN , First Publish Date - 2022-07-18T07:24:28+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి, నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించిన మార్గరేట్‌ ఆల్వా విపక్షాల తరఫున ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచారు.

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్‌ అల్వా

కేంద్ర మంత్రిగా, గవర్నర్‌గా సేవలు..

ప్రతిపక్షాల భేటీకి తృణమూల్‌, ఆప్‌ డుమ్మా

కాంగ్రెస్‌ నేతలతో స్వరం కలిపిన టీఆర్‌ఎస్‌

రాష్ట్రపతి ఎన్నికలు నేడే బరిలో ఎన్డీయే అఽభ్యర్థిగా ద్రౌపది ముర్ము

విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌

ఎంపీలతో బీజేపీ విందు సమావేశం

అందరూ పక్కాగా ఓటేయాలని ఆదేశం


న్యూఢిల్లీ, బెంగళూరు, జూలై 17(ఆంధ్రజ్యోతి): కేంద్ర మాజీ మంత్రి, నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించిన మార్గరేట్‌ ఆల్వా విపక్షాల తరఫున ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచారు. ఆదివారం ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ నివాసంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో 80ఏళ్ల కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు మార్గరేట్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకున్నా రు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గే, డీఎంకే నేత టీఆర్‌ బాలు, శివసేన నేత సంజయ్‌ రౌత్‌, సీపీఐ, సీపీఎం నేతలు డి.రాజా, సీతారాం ఏచూరి, బినయ్‌ విశ్వం, ఎండీఎంకే నేత వైకో, సమాజ్‌ వాదీ పార్టీకి చెందిన రాంగోపాల్‌ యాదవ్‌, ఆర్‌జేడీ నేత అమరేంద్ర ధన్‌సింగ్‌తో పాటు టీఆర్‌ఎస్‌ నేత కేశవరావు హాజరయ్యారు. టీఎంసీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ డుమ్మా కొట్టాయి. మార్గరేట్‌ ఆల్వా ఎంపికకు 17 పార్టీలు అంగీకారం తెలిపినట్లు శరద్‌పవార్‌ వెల్లడించారు. మంగళవారం ఆమె నామినేషన్‌ దాఖ లు చేస్తారని చెప్పారు. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరేట్‌ పేరును ప్రకటించడం పట్ల కన్నడ కాంగ్రెస్‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు. 


మంగళూరు నుంచి..

మార్గరెట్‌ ఆల్వా 1942 ఏప్రిల్‌ 14న మంగళూరులో జన్మించారు. బెంగళూరు మౌంట్‌ కార్మెల్‌ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె బెంగళూరు లా కాలేజీలో న్యాయవాద విద్యను పూర్తి చేశారు. న్యాయవాదిగా రాణిస్తూనే కాం గ్రెస్‌ పార్టీలో క్రియాశీలంగా పనిచేశారు. 1964లో నిరంజన్‌ ఆల్వాను వివాహమాడారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కాంగ్రెస్‌ జాతీయ స్థాయి నేతగా వ్యవహరించారు. 1991 నుంచి 2004 దాకా పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగారు. కేంద్ర కేబినెట్‌లో పలు మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహించారు. జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో కొనసాగారు. కాగా.. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖడ్‌, విపక్షాల అభ్యర్థి మార్గరేట్‌ల మధ్య సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరూ కేంద్ర మంత్రులుగా, గవర్నర్లుగా పనిచేశారని, న్యాయవాద డిగ్రీ లు పుచ్చుకుని, అడ్వొకేట్లుగా సేవలందించారని విశ్లేషకులు చెబుతున్నారు.


రైతుబిడ్డకు మద్దతివ్వండి: నడ్డా

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రైతు బిడ్డ(కిసాన్‌ పుత్ర) అయిన ఎన్డీయే అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖడ్‌కు మద్దతివ్వాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విపక్షాలను కోరారు. కాగా.. ఒడిసా అధికార పార్టీ బిజూ జనతాదళ్‌(బీజేడీ) తమ మద్దతు జగదీ్‌పకేనని ప్రకటించింది


విపక్షాల నిర్ణయాన్ని అంగీకరిస్తున్నా: మార్గరెట్‌

విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేయడం పట్ల మార్గరెట్‌ ఆల్వా ట్విటర్‌లో స్పందించారు. తనను ఎంపిక చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. విపక్షాల నిర్ణయాన్ని అంగీకరిస్తున్నానని పేర్కొన్న ఆమె.. తనపట్ల విశ్వాసం ఉంచిన నేతలందరికీ కృతజ్ఞతలు చెప్పారు.

Updated Date - 2022-07-18T07:24:28+05:30 IST