Chief Justice: మద్రాస్ హైకోర్టు సీజేగా మురళీధర్

ABN , First Publish Date - 2022-09-30T14:29:44+05:30 IST

మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌. మురళీధర్‌(Justice S. Muralidhar) నియమితులు

Chief Justice: మద్రాస్ హైకోర్టు సీజేగా మురళీధర్

చెన్నై, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌. మురళీధర్‌(Justice S. Muralidhar) నియమితులు కానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని కొలీజియం గురువారం సిఫారసు చేసింది. దీనిని పరిశీలించిన అనంతరం కేంద్రప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదానికి పంపించనుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం తుది ఉత్తర్వులు వెలువడనున్నాయి. 1961 ఆగస్టు 8న జన్మించిన జస్టిస్‌ మురళీధర్‌.. 1984 సెప్టెంబరు 12న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. అనంతరం చెన్నై సివిల్‌ కోర్టు, ఢిల్లీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేశారు. 2006 మే 29న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007 ఆగస్టు 29న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2020 మార్చి 6వ తేదీ పంజాబ్‌, హర్యానా హైకోర్టులకు బదిలీ అయ్యారు. అదే ఏడాది డిసెంబరు 31న ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆయన్ని మద్రాస్‌ హైకోర్టు సీజేగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇదిలా వుండగా హైకోర్టు సీజేగా వున్న జస్టిస్‌ మునీశ్వర్‌నాధ్‌ భండారి గత నెల 22న పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా వున్న జస్టిస్‌ డి.రాజా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

Updated Date - 2022-09-30T14:29:44+05:30 IST