Cong president campaign: పార్టీలో మార్పు ఖర్గే వల్ల కాదు: శిశథరూర్
ABN , First Publish Date - 2022-10-02T23:25:32+05:30 IST
మల్లికార్జున్ ఖర్గే వంటి నేతలు పార్టీలో మార్పు తీసుకురాలేరని, ప్రస్తుతం ఉన్న వ్యవస్థనే కొనసాగిస్తారని ..
న్యూఢిల్లీ: మల్లికార్జున్ ఖర్గే వంటి నేతలు పార్టీలో మార్పు తీసుకురాలేరని, ప్రస్తుతం ఉన్న వ్యవస్థనే కొనసాగిస్తారని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పోటీ పడుతున్న ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ (Shashi tharoor) అన్నారు. మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ ఈ ఎన్నికల్లో ముఖాముఖీ తలపడుతున్నారు. ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు.
మహారాష్ట్రలోని దీక్షాభూమి స్మారకాన్ని సందర్శించిన అనంతరం ఎన్నికల ప్రచారానికి శశిథరూర్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నాగపూర్లో ఆయన మాట్లాడుతూ..''మేము (ఖర్గే-థరూర్) శత్రువులం కాదు. మా మధ్య జరుగుతున్నది యుద్ధం కూడా కాదు. ఇది పార్టీ భవిష్యత్ కోసం జరుగుతున్న పోల్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ టాప్-3 అగ్రనేతల్లో ఆయన ఒకరు. అయితే ఆయన వంటి నేతను మార్పు తీసుకురాలేరు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థనే కొనసాగిస్తారు. నేను మాత్రం పార్టీ కార్యకర్తల అంచనాలకు అనుగుణంగా మార్పు తీసుకువస్తాను'' అని అన్నారు.
గాంధీ ఫ్యామిలీ మొగ్గు ఖర్గేపై ఉండే అవకాశాలపై అడిగినప్పుడు, గాంధీ ఫ్యామిలీ నుంచి ముగ్గురినీ (సోనియా, రాహుల్, ప్రియాంక) తాను కలుసుకున్నానని, పార్టీ తరఫున అధికారిక అభ్యర్థి ఎవరూ లేరని వారు పదేపదే తనకు చెప్పారని ఆయన తెలిపారు సుహృద్భావ వాతావరణంలో, పారదర్శికంగా ఎన్నికలు జరగాలని మాత్రమే వారు కోరుకున్నారని అన్నారు. గాంధీ కుటుంబం తటస్థంగా ఉంటుందని, పార్టీ యంత్రాంగం నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందని చెప్పారు. పార్టీ అధ్యక్షురాలు ఇచ్చిన హామీపై తనకు ఎలాంటి అనుమానాలు కూడా లేవని ఆయన మీడియాకు తెలిపారు.