Delhi: ఆసుపత్రిలో జామియా విద్యార్థిపై కాల్పులు

ABN , First Publish Date - 2022-09-30T20:54:04+05:30 IST

దేశ రాజధానిలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో..

Delhi: ఆసుపత్రిలో జామియా విద్యార్థిపై కాల్పులు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో జామియా మిలియా ఇస్లామియా విద్యార్థి తలపై బుల్లెట్ గాయం కాగా, మరో విద్యార్థి కూడా స్వల్పంగా గాయపడ్డాడు. దీనిపై పోలీసులు శుక్రవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.


సంఘటన వివరాల ప్రకారం, గురువారం రాత్రి 8.50 గంటల ప్రంతంలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ లైబ్రరీలో రెండు వర్గాల విద్యార్థుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ గొడవలో యూపీలోని మీరట్ జిల్లా నివాసి నోమన్ చౌదరి (26) తలపై గాయాలయ్యాయి. దీంతో అతనితో పాటు అతని మిత్రుడు నౌమాన్ అలీ కూడా చికిత్స కోసం హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో చేరాడు. ఈ క్రమంలో రెండో వర్గానికి చెందిన జలాల్ అనే వ్యక్తి తన మిత్రులతో కలిసి ఆసుపత్రికి వచ్చి ఎమర్జెన్సీ వార్డు వెలుపల నుంచి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నౌమాన్ అలీ తలపై చర్మాన్ని రాసుకుంటూ బుల్లెట్ దూసుకెళ్లడంతో అతన్ని ఎయిమ్స్ ట్రౌమా సెంటర్‌కు తరలించారు. క్రైమ్ టీమ్ ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు జరుపుతోంది.


కాగా, జామియా నగర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణలో గాయపడిన కొందర్ని హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డుకు చికిత్స కోసం తీసుకు వచ్చారని హోలీ ఫ్యా్మిలీ ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది. ఎమర్జెన్సీ వద్ద కాల్పుల ఘటన చోటుచేసుకున్నప్పటికీ పేషెంట్లు కానీ, ఆసుపత్రి సిబ్బంది కానీ ఎవరూ గాయపడలేదని, పరిస్థితి వెంటనే అదుపులోకి వచ్చిందని తెలిపింది.

Updated Date - 2022-09-30T20:54:04+05:30 IST