Terrorism : ఉగ్రవాద భూతాన్ని ప్రపంచం గుర్తించక ముందే భారత్ తీవ్రంగా నష్టపోయింది : మోదీ

ABN , First Publish Date - 2022-11-18T13:56:17+05:30 IST

ఉగ్రవాద దాడులు జరిగినపుడు స్పందించే తీరు ఒకే విధంగా ఉండాలని, ఆ దాడి ఎక్కడ జరిగిందనే అంశం ప్రాతిపదిక

Terrorism : ఉగ్రవాద భూతాన్ని ప్రపంచం గుర్తించక ముందే భారత్ తీవ్రంగా నష్టపోయింది : మోదీ
Narendra Modi

న్యూఢిల్లీ : ఉగ్రవాద దాడులు జరిగినపుడు స్పందించే తీరు ఒకే విధంగా ఉండాలని, ఆ దాడి ఎక్కడ జరిగిందనే అంశం ప్రాతిపదిక కాకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. అన్ని ఉగ్రవాద దాడులపైనా సమానంగా ఆగ్రహం వ్యక్తంకావాలని, చర్యలు ఉండాలని తెలిపారు. ప్రపంచానికి ముప్పు కలిగించే అంశంపై వ్యవహరించడంలో సందిగ్ధ వైఖరికి చోటు ఉండకూడదని వివరించారు.

ఉగ్రవాద నిరోధానికి నిధులను సమకూర్చడంపై మినిస్టీరియల్ కాన్ఫరెన్స్‌లో మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని ప్రపంచం గుర్తించడానికి ముందే దాని చీకటి కోణాన్ని మన దేశం చూసిందన్నారు. ఉగ్రవాదం వేర్వేరు పేర్లతో, రూపాల్లో మన దేశాన్ని బాధించేందుకు అనేక దశాబ్దాల నుంచి ప్రయత్నిస్తోందన్నారు. అత్యంత విలువైన వేలాదిమందిని కోల్పోయామన్నారు. అయితే మనం ఉగ్రవాదంతో ధైర్యసాహసాలతో పోరాడుతున్నామని చెప్పారు.

ఒక ఉగ్రవాద దాడి జరిగినా తాము తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఒక ప్రాణం పోయినా అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తామని చెప్పారు. ఉగ్రవాదం కూకటివేళ్ళు తెగిపోయే వరకు తాము విశ్రమించబోమని తెలిపారు.

పరోక్షంగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లను ప్రస్తావిస్తూ, కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానంలో భాగంగా ఉగ్రవాదులకు మద్దతిస్తున్నాయన్నారు. ఈ దేశాలు ఉగ్రవాదులకు రాజకీయ, సైద్ధాంతిక, ఆర్థిక మద్దతు పలుకుతున్నాయన్నారు. ఇటువంటి దేశాలు మూల్యం చెల్లించే విధంగా చేయాలన్నారు. నిరంతరం ముప్పును ఎదుర్కొనే ప్రాంతాన్ని ఎవరూ ఇష్టపడరని చెప్పారు. ఇటువంటి పరిస్థితులు ఎక్కడ ఉంటే అక్కడి ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందన్నారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే వ్యవస్థల మూలాలను, కూకటివేళ్ళను తెగ్గొట్టాలని, ఇది చాలా ముఖ్యమని తెలిపారు.

ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ప్రకటనలో, కౌంటర్ టెర్రరిజం ఫైనాన్సింగ్, అదేవిధంగా ఉగ్రవాదం వల్ల ఉత్పన్నమవుతున్న సవాళ్ళపై స్పందించడంలో ప్రస్తుత అంతర్జాతీయ సమాజం సమర్థతపై చర్చించేందుకు భాగస్వామ్య దేశాలు, సంస్థలకు ప్రత్యేక వేదికగా ఈ సమావేశం ఉపయోగపడుతుందని తెలిపింది. పారిస్ (2018 ఏప్రిల్), మెల్‌బోర్న్ (2019 నవంబరు)లలో జరిగిన సమావేశాల ఫలితాలు, అనుభవాల ఆధారంగా కృషి చేయడానికి ఈ సమావేశం దోహదపడుతుందని పేర్కొంది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని, కార్యకలాపాల నిర్వహణకు అనుమతులను నిరాకరించేందుకు అంతర్జాతీయ సహకారాన్ని మరింత పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపింది.

Updated Date - 2022-11-18T13:56:21+05:30 IST