పెరిగిన నకిలీ నోట్లు
ABN , First Publish Date - 2022-05-30T09:55:19+05:30 IST
దేశంలో నకిలీ నోట్లు భారీగా పెరిగిపోయాయంటూ భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తాజా వార్షిక నివేదిక వెల్లడించింది.
న్యూఢిల్లీ, మే 29: దేశంలో నకిలీ నోట్లు భారీగా పెరిగిపోయాయంటూ భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తాజా వార్షిక నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేంద్రంపై దాడికి విపక్షాలకు కొత్త ఆయుధం దొరికినట్టయింది. 2016లో చేపట్టిన పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియెన్ విరుచుకుపడ్డారు. తాజా గణాంకాలపై ట్విటర్ వేదికగా రాహుల్ స్పందించారు. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే పెద్ద నోట్ల రద్దు ఏకైక దురదృష్టకరమైన విజయమంటూ ట్వీట్ చేశారు. నకిలీ 500 నోట్లు 100 శాతానికిపైగా, నకిలీ 2,000 నోట్లు 50 శాతానికిపైగా పెరిగాయంటూ ఆర్బీఐ నివేదికను ఉటంకిస్తూ వెలువడిన మీడియా కథనం స్ర్కీన్ షాట్ను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. పెద్ద నోట్ల రద్దుతో మొత్తం నకిలీ నోట్లు తుడిచిపెట్టుకుపోతాయని ఎలా హామీ ఇచ్చారని ప్రధానిని డెరెక్ ఓబ్రియెన్ ప్రశ్నించారు.