Maharashtra: ముంబైలో వారు లేకపోతే... గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-07-30T20:02:03+05:30 IST
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాతీలు, రాజస్థానీలు..
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి (Bhagat sing koshyari) సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్రను విడిచి వెళ్లితే దేశ ఆర్థిక రాజధానిలో డబ్బేం మిగలదని వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...''నేను ఇక్కడి ప్రజలకు ఒకటి చెప్పదలచుకున్నాను. గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్రను వీడి వెళ్లితే, ముఖ్యంగా ముంబై, థానేను విడిచిపెడితే, ముంబైలో డబ్బేం మిగలదు. దేశ వాణిజ్య రాజధానిగా ఉండే అర్హత ముంబై కోల్పోతుంది'' అని ఆయన అన్నారు. ముంబై పశ్చిమ శివార్లలోని అంధేరిలో ఒక చౌక్కు పేరు పెట్టే కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
భగ్గుమన్న శివసేన..
గవర్నర్ కోష్యారి తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కనీసం గవర్నర్ ప్రకటననైనా ఖండించాలని అని ట్వీట్ చేశారు. బీజేపీ స్పాన్సర్ చేసిన ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే మహారాష్ట్ర ప్రజలను అవమానించడం మొదలైందని, కష్టపడి పనిచేసే మహారాష్ట్ర ప్రజలను గవర్నర్ అవమానించారని సంజయ్ రౌత్ తప్పుపట్టారు.