Heavy rains: చెన్నైలో వరుణుడి ప్రతాపం
ABN , First Publish Date - 2022-09-29T13:37:05+05:30 IST
ఉపరితల ఆవర్తనం కారణంగా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు(Chennai, Kanchipuram, Tiruvallur) సహా 15 జిల్లాల్లో రాబోవు రెండు రోజుల్లో
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- 15 జిల్లాలకు భారీ వర్షసూచన
చెన్నై, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఉపరితల ఆవర్తనం కారణంగా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు(Chennai, Kanchipuram, Tiruvallur) సహా 15 జిల్లాల్లో రాబోవు రెండు రోజుల్లో భారీవర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం నగరంలో ఆకాశం మేఘావృతమై భారీగా వర్షం కురిసింది. దీంతో నగరంలోని టి.నగర్, రాయపేట, వ్యాసార్పాడి, ట్రిప్లికేన్, మైలాపూర్, అడయార్, తాంబరం, ఆవడి, అంబత్తూరు, విల్లివాక్కం, అన్నానగర్, కోయంబేడు, మధురవాయల్లోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారుల్లో వర్షపు నీరు వరదలా ప్రవహించడంతో సిటీ బస్సులు తదితర వాహనాలు నత్తనడక నడిచాయి. పలుచోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా సముద్రతీర ప్రాంతాల్లో పెనుగాలుల కారణంగా రాష్ట్రంలోని దక్షిణాది ప్రాంతాలు, పుదుచ్చేరి, కారైక్కాల్లో కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం చెదురుమదురుగా వర్షాలు కురిసినట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాబోవు రెండు రోజుల్లో వేలూరు, రాణిపేట, తిరుపత్తూరు, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం, కడలూరు. మైలాడుదురై, నాగపట్టినం, తంజావూరు, తిరువారూరు, అరియలూరు, పెరంబలూరు, కళ్లకుర్చి, తిరువణ్ణామలై జిల్లాల్లో భారీగా వర్షాలు కురిస్తున్నాయని పేర్కొన్నారు. నగరానికి సంబంధించినంత వరకూ గురువారం పలుచోట్ల ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.