CBI investigation: మళ్లీ తెరపైకి గుట్కా కేసు
ABN , First Publish Date - 2022-07-24T13:12:50+05:30 IST
అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో జరిగిన గుట్కా(Gutkha) అవినీతి అక్రమాల కేసులో ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు సి. విజయభాస్కర్, రమణపై
- మాజీ మంత్రులు విజయభాస్కర్, రమణపై సీబీఐ విచారణకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
చెన్నై, జూలై 23 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో జరిగిన గుట్కా(Gutkha) అవినీతి అక్రమాల కేసులో ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు సి. విజయభాస్కర్, రమణపై సీబీఐ విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Jayalalita) మృతి తర్వాత రాష్ట్రంలో నిషేధిత గుట్కా పొగాకు వస్తువుల అమ్మకాలు ఊపందుకున్నాయి. మాధవరం ప్రాంతానికి చెందిన స్మగ్లర్ గుట్కా(Gutkha) విక్రయించేందుకుగాను అప్పటి మంత్రులు విజయభాస్కర్, రమణలకు ప్రతినెలా లక్షలాది రూపాయలను ముడుపులుగా చెల్లించనట్లు ఆరోపణలు వచ్చాయి. మాధవరం గుట్కా(Gutkha) వ్యాపారికి చెందిన గోదాముల్లో ఐటీ అధికారులు నిర్వహించిన దాడుల్లో లభించిన డైరీలో మంత్రులు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు ఆ వ్యాపారి ప్రతినెలా చెల్లించిన ముడుపులు వివరాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఆ నేపథ్యంలో విజయభాస్కర్ నివాసం, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి కీలకమైన దస్తావేజులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత 2018లో ఈ అవినీతి కేసు సీబీఐ(CBI)కి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో గుట్కా ముడుపుల కేసులో మాజీ మంత్రులు విజయభాస్కర్, రమణ సహా 12 మంది విచారణ జరిపేందుకు అనుమతివ్వాలని కోరుతూ సీబీఐ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ లేఖపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వారిపై విచారణకు అనుమతి జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన కూడా జారీ చేసింది. ఈ కేసులో మాజీ మంత్రులతోపాటు అప్పటి చెన్నై పోలీసు కమిషనర్లు రాజేంద్రన్, జార్జ్ సహా 12 మంది నిందితులుగా ఉన్నారు. సీబీఐ ప్రస్తుతం వీరి వద్ద తీవ్ర విచారణ జరుపనుంది.