Cakes: నగరంలో గంజాయి కేక్‌లు

ABN , First Publish Date - 2022-09-21T14:19:35+05:30 IST

రాష్ట్రంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి కేక్‌ల అమ్మకాలు జరుగుతున్నాయి. గతంలో చాక్లెట్ల రూపంలో అంగళ్ల లో జరిగిన గంజాయి విక్ర

Cakes: నగరంలో గంజాయి కేక్‌లు

- విద్యార్థినులే అత్యధిక బాధితులు ?

- తయారీ ముఠా ఆచూకీ కోసం పోలీసుల వేట?


చెన్నై, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి కేక్‌ల అమ్మకాలు జరుగుతున్నాయి. గతంలో చాక్లెట్ల రూపంలో అంగళ్ల లో జరిగిన గంజాయి విక్రయాలు ప్రస్తుతం కొత్త రూపు సంతరించుకున్నాయి. గంజాయి ముఠా ఇళ్లలోనే గంజాయితో కేక్‌లను తయారు చేసి కళాశాలలు, పాఠశాలల వద్ద దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. సాధారణ కేక్‌ కంటే ఈ గంజాయి కేక్‌ ధర భారీగా వుంటుంది. ఒకసారి ఈ గంజాయి కేక్‌ రుచి చూస్తే మరుసటి రోజు నుండి ఆ కేక్‌ తినకుండా ఉండలేరు. చివరకు వాటికి బానిసలైపోతారు. గత మూడు నెలలుగా ఈ గంజాయి కేక్‌ల విక్రయాలు ఊపందుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ గంజాయి కేక్‌లను బహిరంగ ప్రదేశాల్లోనే విద్యార్థులు తింటూ వాటికి బానిసలవుతున్నారు. గంజాయితోపాటు నిషేధిత పొగాకు వస్తువుల విక్రయాలను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ శైలేంద్రబాబు పదేపదే ఆదేశాలిస్తున్నా గంజాయి అమ్మకాలు ఏ మాత్రం తగ్గడంలేదు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల నుండే గంజాయిని అక్రమంగా నగరానికి తరలిస్తున్నారు. ఇక తేని జిల్లాలోని కొండ ప్రాంతాల్లో పోలీసుల కళ్లుగప్పి గంజాయి సాగుచేస్తున్నారు. అక్కడ నుంచి గంజాయి తీసుకువచ్చి వాటిని పొడిచేసి కేక్‌లలో కలిపి విక్రయిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ గంజాయి కేక్‌లకు విద్యార్థినులు కూడా బానిసలయ్యారు. వీరంతా తమ పుట్టినరోజు వేడుకలను గంజాయి కేక్‌లతోనే జరుపుకుంటున్నట్లు వస్తున్న వార్తలు పోలీస్ శాఖను వణికిస్తున్నాయి. ఆ కేక్‌ల్లో గంజాయి ఉన్న విషయం ఒకరిద్దరికి మినహా మిగిలినవారెవరికీ తెలియదు. దీంతో ఇతర విద్యార్థినులు తెలియకుండానే గంజాయికి బానిసై తర్వాత ఆ కేక్‌ను రెట్టింపు ధర చెల్లించి కొనేందుకు ఎగబడుతున్నారు. గంజాయి కేక్‌ తింటే వాసన రాకపోవడంతో ఈ కేక్‌లపై విద్యార్థులు ఆసక్తి చూపిస్తు న్నారు. 


ఐదుగురి అరెస్టు....

స్థానిక నుంగంబాక్కంలో గంజాయి కేక్‌ల అమ్మకం జరుగుతుందనే సమాచారంతోతో పోలీసులు తనిఖీ చేసి హోటల్‌ యజమాని విజయ్‌రోషన్‌ టెక్కా, టాటూ సంస్థ నడిపే థామ్‌సను అరెస్టు చేశారు. వారిని పోలీసులు విచాచించగా గంజాయి కేక్‌ల విక్రయాల వ్యవహారం బయటపడింది. వీరిద్దరూ బర్త్‌డే పార్టీలంటూ యువత ను పిలిచి వారికి గంజాయి కేక్‌ ముక్కలను ఇస్తునట్లు తెలుసుకున్నారు. ఇదే విధంగా నగరంలోని పలు కళాశాలలు, యూనివర్సిటీల వద్ద కూడా ఈ గంజాయి కేక్‌లు అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరితోపాటు కార్తీక్‌, ఆకాష్‌, పవన్‌ కల్యాణ్‌ అనే వారిని కూడా అరెస్టు చేశారు. ఇక నగరంలో గంజాయి కేక్‌లను తయారు చేసి టోకుగా విక్రయించిన ముఠా నాయకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Updated Date - 2022-09-21T14:19:35+05:30 IST