Mulayam Singh Yadav: మరింత విషమించిన ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం.. ఐసీయూలో చికిత్స..
ABN , First Publish Date - 2022-10-02T23:16:41+05:30 IST
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) ఆరోగ్య పరిస్థితి విషమించింది. అనారోగ్యం బారిన పడిన ఆయనను..
గురుగ్రామ్: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) ఆరోగ్య పరిస్థితి విషమించింది. అనారోగ్యం బారిన పడిన ఆయనను కొన్ని రోజుల క్రితం గురుగ్రామ్లోని మేదాంత హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు. ఆదివారం నాడు ములాయం ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఐసీయూ వార్డుకు తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ప్రముఖ వైద్య నిపుణులు సుషీలా కటారియా ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి అఖిలేష్ యాదవ్కు సమాచారం అందడంతో హుటాహుటిన ఆసుపత్రికి బయల్దేరి వెళ్లినట్టు తెలిసింది.
ములాయం సింగ్ యాదవ్ వయసు 82 సంవత్సరాలు. మూడు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దేశ రక్షణ శాఖా మంత్రిగా కూడా సేవలందించారు. కొన్ని వారాలుగా ములాయం సింగ్ యాదవ్ గురుగ్రామ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో కరోనా బారిన పడటంతో ములాయం సింగ్ను అప్పటి నుంచి అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టాయి. రెండో భార్య మరణం కూడా ఆయనను మరింత కుంగదీసింది. అనారోగ్యం కారణంగా క్రియాశీల రాజకీయాలకు కొంత కాలంగా ములాయం దూరంగానే ఉన్నారు. ఆయన కుమారుడు అఖిలేష్ యాదవే అన్నీ తానై పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు.