Durga idols immersion: దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవంలో అపశ్రుతి...వేర్వేరు ఘటనల్లో 15 మంది మృతి
ABN , First Publish Date - 2022-10-06T13:21:17+05:30 IST
దేశంలో దుర్గా పూజ ఉత్సవం ముగింపు నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది....
న్యూఢిల్లీ: దేశంలో దుర్గా పూజ ఉత్సవం ముగింపు నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం(Durga idols immersion) సందర్భంగా 15మంది మరణించారు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా జరిగిన ప్రమాదాల్లో పలువురు మరణించారు. బుధవారం రాత్రి జల్పాయ్ గురి నగర సమీపంలోని(West Bengals Jalpaiguri) మాల్ నదిలో దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా మెరుపు వరద( flash floods) వచ్చింది. మాల్ నది తీరంలో నిమజ్జనం సందర్భంగా పెద్దఎత్తున భక్తులు గుమిగూడారు. ఈ మెరుపు వరదల్లో పలువురు భక్తులు కొట్టుకుపోయారు. ఏడుగురి మృతదేహాలను వెలికితీశామని, గాయపడిన 15మందిని ఆసుపత్రిలో చేర్చామని జల్పాయ్ గురి జిల్లా మెజిస్ట్రేట్ మౌమిత గోదరా బసు చెప్పారు.
నదీ తీరంలో ఉన్న 60 మందిని వరదల బారి నుంచి కాపాడమని మెజిస్ట్రేట్ చెప్పారు. భారీవర్షాల వల్ల మాల్ నదిలో మెరుపు వరదలు వచ్చి ఈ దుర్ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో దుర్గా విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఇద్దరు యువకులు యమునా నదిలో మునిగి మరణించారు. రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాలో వరదనీటిలో మునిగి ఆరుగురు మరణించారు. గణేష్ నిమజ్జనోత్సవంలోనూ 20 మంది మరణించారు.